కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్పై ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి కొనసాగుతున్న విచారణ ప్రక్రియ ముగిసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి 'నో అబ్జెక్షన్' సర్టిఫికెట్ పొందిన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 డిసెంబర్ 12న కాంపౌండింగ్ ఆర్డర్ను జారీ చేసింది. ఈ మేరకు ఈడీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.విశ్వసనీయ సమాచారం ఆధారంగా, కాకినాడ సీపోర్ట్స్పై ఈడీ ఫెమా నిబంధనల కింద దర్యాప్తు చేపట్టింది. విచారణ అనంతరం 2024 సెప్టెంబర్ 5న అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు ఈడీ ఫిర్యాదు చేసింది. సుమారు రూ. 22.88 కోట్ల విదేశీ చెల్లింపుల సమాచారం ఆలస్యంగా నివేదించడం, రూ. 23.31 కోట్ల విలువైన షేర్ల జారీ తర్వాత ఫారం ఎఫ్సీజీపీఆర్ దాఖలులో జాప్యం, రూ. 7.21 కోట్ల విలువైన షేర్ల కేటాయింపులో ఆలస్యం వంటి ఉల్లంఘనలు జరిగినట్టు ఈడీ తన ఫిర్యాదులో పేర్కొంది.దీంతో 2024 సెప్టెంబర్ 30న కంపెనీతో పాటు సంబంధిత డైరెక్టర్లకు అడ్జుడికేటింగ్ అథారిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత, కంపెనీ ఫెమా సెక్షన్ 15 ప్రకారం ఉల్లంఘనల పరిష్కారానికి ఆర్బీఐకి కాంపౌండింగ్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఆర్బీఐ సూచన మేరకు ఈడీ దీనికి అభ్యంతరం లేదని తెలిపింది.ఫలితంగా, రూ. 21.68 లక్షల జరిమానాను ఒక్కసారిగా చెల్లించాలనే షరతుతో ఆర్బీఐ కాంపౌండింగ్ ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆదేశాలతో కంపెనీపై ఫెమా కింద కొనసాగుతున్న విచారణ ప్రక్రియతో పాటు తదుపరి న్యాయపరమైన చర్యలన్నింటికీ తెరపడినట్టు ఈడీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa