మనం ఏదైనా హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి తిన్నప్పుడు అక్కడ ఇచ్చే బిల్లులో ఆటోమేటిక్గా సర్వీస్ ఛార్జ్ విధిస్తూ ఉంటారు. అయితే ఇలా నేరుగా సర్వీస్ ఛార్జీని కస్టమర్ల బిల్లులో కలపడం చట్టపరంగా నేరం. అయినప్పటికీ చాలా రెస్టారెంట్లు, హోటళ్లు.. బిల్లులోనే సర్వీస్ ఛార్జీని కలిపి కస్టమర్ల జేబులకు చిల్లు పెడుతూనే ఉంటాయి. అయితే దీనిపై వెల్లువెత్తిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (సీసీపీఏ) కఠిన చర్యలు చేపట్టింది. ఇలా సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమేనని.. ఇది అన్యాయమని తేల్చి చెప్పింది.
సీసీపీఏ మార్గదర్శకాలు
2022 జూలై 4వ తేదీన కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సర్వీస్ ఛార్జ్ చెల్లించాలా వద్దా అనేది పూర్తిగా కస్టమర్ ఇష్టమని తెలిపింది. ఈ సర్వీస్ ఛార్జీని వారి బిల్లులో ఆటోమేటిక్గా చేర్చకూడదని తేల్చి చెప్పింది. సర్వీస్ ఛార్జీని నేరుగా కాకుండా మరే ఇతర పేరుతోనూ ఉదాహరణకు వెల్ఫేర్ ఫండ్, సర్వీస్ ఫీ పేరు చెప్పి వసూలు చేయకూడదని పేర్కొంది. సర్వీస్ ఛార్జ్ కట్టడం లేదని కస్టమర్ను రెస్టారెంట్లోకి రాకుండా అడ్డుకోకూడదని క్లారిటీ ఇఛ్చింది. సర్వీస్ ఛార్జ్ను ఫుడ్ బిల్లులో కలిపి దానిపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వేయడం చట్టవిరుద్ధమని సీసీపీఐ మార్గదర్శకాలు వెల్లడిస్తున్నాయి.
2025 మార్చి 28వ తేదీన కస్టమర్ల బిల్లులో సర్వీస్ ఛార్జీలు విధించడంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా 27 రెస్టారెంట్లపై సీసీపీఏ చర్యలు తీసుకుంది. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఉన్న బోరా బోరా రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించిన సీసీపీఏ అధికారులు.. ఆ హోటల్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ నుంచి ఆటోమేటిక్ సర్వీస్ ఛార్జీని తొలగించాలని ఆదేశించారు. అంతేకాకుండా బోరో బోరా రెస్టారెంట్కు రూ.50 వేల జరిమానా విధించారు. అదే విధంగా బిహార్ రాజధాని పాట్నా నగరంలోని కాఫీ బ్లూ బాటిల్ హోటల్లో కస్టమర్ నుంచి వసూలు చేసిన సర్వీస్ ఛార్జీని రీఫండ్ చేయాలని ఆదేశిస్తూ.. రూ.30 వేల జరిమానా కట్టాలని తేల్చి చెప్పింది.
కస్టమర్లు ఏం చేయాలి?
మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కు వెళ్లినప్పుడు బిల్లులో సర్వీస్ ఛార్జ్ కనిపిస్తే.. ఆ సర్వీస్ ఛార్జీని తొలగించమని రెస్టారెంట్ యాజమాన్యాన్ని కోరవచ్చు. ఒకవేళ వారు మాట వినకపోతే.. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ నంబర్ 1930 లేదా 1800 11 4000కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేని పక్షంలో రెస్టారెంట్ బిల్లు కాపీతో సహా ఎన్సీహెచ్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa