శనివారం (ఫిబ్రవరి 28న) అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్లో మరణించిన ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ వారసుడ్ని ఎంపిక చేశారు. ఖమేనీ రెండో కుమారుడు మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ సుప్రీం నేతగా ఎంపికైనట్టు వార్తలు వస్తున్న వేళ దీని స్పందించిన ఇజ్రాయెల్.. కొత్త నేతను కూడా వదలిపెట్టబోమని హెచ్చరించింది. ఇరాన్ ప్రభుత్వం నియమించిన ఏ నాయకుడికైనా తమ చేతుల్లో చావు తప్పదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెలీ కాట్జ్ హెచ్చరికలు చేశారు. పరోక్షంగా మోజ్తాబాను చంపడానికి ఇజ్రాయెల్ రక్షణ దళాల (IDF)కు ప్రధాని బెంజిమన్ నెతన్యాహు, తాను ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ఆపరేషన్ ‘రోర్ ఆఫ్ ది లయన్’లో భాగంగా మరో మిషన్ కోసం అన్ని విధాలుగా సంసిద్ధం కావాలని, కార్యాచరణ చేపట్టాలని ఐడీఎఫ్కు సూచించినట్లు వివరించారు. ఇదిలా ఉండగా, ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందు ఇరాన్ను ఇజ్రాయెల్ మరింత రెచ్చగొట్టేలా ప్రకటన చేయడం గమనార్హం. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) ఒత్తిడి మేరకు 88 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ కొత్త సుప్రీం నేతగా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ ఎన్నుకుంది. ఆయన త్వరలోనే పగ్గాలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఇజ్రాయెల్ నుంచి వార్నింగ్ వచ్చింది.
ఇజ్రాయెల్ను నాశనం చేయాలనుకునేవారిని వదిలిపెట్టబోమని కాట్జ్ స్పష్టం చేశారు. అమెరికా సహా ప్రపంచం దేశాలను బెదిరించడానికి, ఇరాన్ పౌరులను అణచివేయడానికి టెహ్రాన్ ప్రభుత్వం నియమించిన ఏ నేతనైనా నిస్సందేహంగా అంతం చేస్తామని తేల్చిచెప్పారు. అతడు ఎవరైనా.. ఎక్కడ దాక్కున్నా తమ నుంచి తప్పించుకోలేడని శపథం చేశారు. ఇరాన్ పాలన సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తామని, ఇందుకు అమెరికా భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. అటు, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా, ఇరాన్ సీక్రెట్ అణు ప్రాజెక్ట్ను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. గతేడాది జూన్లో 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో తాము ధ్వంసం చేసిన కేంద్రం నుంచి అణు సంపత్తిని ఇరాన్ ఈ రహస్య స్థావరానికి తరలించినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది.
మరోవైపు, పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. కువైట్లోని స్థావరాలను టార్గెట్ చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఈ దాడికి 40 క్షిపణులు, 230 డ్రోన్లను వాడినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఇరాన్లో 1,097 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అమెరికాకు చెందిన మానవహక్కుల సంస్థ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa