మన దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలును ముంబై-అహ్మదాబాద్ మధ్య పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు భారీగా ఆలస్యం అవుతోంది. ఈ జాప్యం కారణంగా ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.1 లక్షల కోట్ల నుంచి రూ.1.98 లక్షల కోట్లకు పెరిగింది. అంటే సుమారు 83 శాతం పెరుగుదల నమోదైంది. భూసేకరణ, అనుమతుల్లో ఆలస్యం వల్ల ఈ ప్రాజెక్టు గడువు 2029 వరకు పొడిగించారు. అయితే 2027 ఆగస్టు నాటికి మాత్రం గుజరాత్లోని సూరత్-బిలిమోరా మధ్య దేశంలోనే మొదటి బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. 4 ఏళ్ల పాటు ప్రాజెక్టు పనుల్లో ఏర్పడిన జాప్యం, నిర్మాణ వ్యయాలు పెరగడం ఈ బడ్జెట్ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొన్నారు.
బడ్జెట్ పెరగడానికి ప్రధాన కారణాలు
భూసేకరణలో జాప్యం
ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ బుల్లెట్ రైలు మార్గంలో భూసేకరణ ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం పట్టింది. రాజకీయ కారణాలు, స్థానిక నిరసనల వల్ల దాదాపు 2 ఏళ్లకు పైగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.
4 ఏళ్ల జాప్యం వల్ల సిమెంట్, స్టీల్ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, కార్మికుల ఖర్చులు పెరగడం ప్రాజెక్టు బడ్జెట్పై ప్రభావం చూపింది.
పర్యావరణ అనుమతులు
అటవీ శాఖ, పర్యావరణ శాఖల నుంచి ప్రాజెక్టు క్లియరెన్స్ పొందడానికి ఆశించిన దానికంటే ఎక్కువ సమయం పట్టింది.
టెక్నికల్ సవాళ్లు
అండర్గ్రౌండ్ పనులు, సముద్రం లోపల సొరంగం వంటి క్లిష్టమైన నిర్మాణ ప్యాకేజీల వ్యయాలు కూడా పెరిగాయి.
కొత్త టైమ్లైన్, ప్రాజెక్టు పురోగతి
బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతలో సూరత్ - బిలిమోరా మధ్య 50 కిలోమీటర్ల మార్గాన్ని 2027 ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 508 కిలోమీటర్ల కారిడార్ను పూర్తి చేయడానికి 2029 డిసెంబర్ నెలను డెడ్లైన్గా పెట్టుకున్నారు. అంటే అప్పటికి ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు పూర్తి స్థాయిలో బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
బుల్లెట్ రైలు ప్రస్తుత స్థితి
బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఫిజికల్ పురోగతి 55 శాతం దాటింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.85,800 కోట్లు ఖర్చు చేసింది.
ప్రాజెక్టు విశేషాలు
ఈ ప్రాజెక్టులో భాగంగా బుల్లెట్ రైలు గంటకు గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్కు 7 నుంచి 8 గంటల సమయం పడుతుండగా.. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 2 గంటల 7 నిమిషాల్లోనే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. జపాన్ ప్రసిద్ధ షింకన్సేన్ టెక్నాలజీని ఈ బుల్లెట్ ప్రాజెక్టులో ఉపయోగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa