ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధానిలో శరవేంగా జరుగుతోన్న సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌,,,,ఈ నెలలోనే కొత్త ఆఫీసులోకి ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Mon, Jan 12, 2026, 08:41 PM

ఢిల్లీలోని రైసినా హిల్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త కార్యాలయం దాదాపు సిద్ధమయ్యింది. భవనానికి తుది మెరుగులు దిద్దుతుండగా.. కొత్త ఆఫీసులోకి ప్రధాని మోదీ ఈ నెలలోనే అడుగుపెట్టనున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా రైసినా హిల్‌లో ప్రధాన మంత్రి కార్యాలయం నిర్మాణం చేపట్టారు. దీనికి ‘సేవా తీర్థ’ అని నామకరణం చేశారు. ఇందులో మొత్తం మూడు భవనాలు ఉండగా.. ఒకటి ప్రధాని ఆఫీసు, రెండోది క్యాబినెట్ సెక్రటేరియట్, మూడోది జాతీయ భద్రతా మండలి కార్యాలయం ఏర్పాటుచేస్తున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో ఇప్పటికే పార్లమెంట్ భవనం, ఉప-రాష్ట్రపతి నిలయం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.


ప్రధాని కార్యాలయం దాదాపు పూర్తి కాగా.. ఎనిమిది మంత్రిత్వ శాఖల భవనాల్లో మూడు ఇప్పటికే అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు మొదలయ్యాయి. కాగా, గతంలో ప్రధాని ఆఫీసుకు ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌ అనే పేరును సూచించారు. కానీ తర్వాత దానిని సేవా తీర్థ్ (సేవకు పవిత్ర స్థలం అని అర్థం) అని నామకరణం చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త కార్యాలయానికి సమీపంలోనే ప్రధానమంత్రి నివాసం కూడా నిర్మిస్తున్నారు. అది సిద్ధమయ్యాక, ఆయన 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని నివాసం నుంచి అక్కడికి మారతారు.


సేవా తీర్థ్‌లో ప్రముఖులను కలిసేందుకు అత్యాధునిక గదులు ఉన్నాయి. ఈ గదులు సాంకేతికంగా అన్ని సౌకర్యాలతో ఉండటమే కాకుండా, భారత సంస్కృతి, సంప్రదాయాలను కూడా ప్రతిబింబిస్తాయి. క్యాబినెట్ సమావేశాల కోసం ప్రత్యేకంగా ఓ హాలును రూపొందించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పుడు ఓపెన్ ఫ్లోర్ నమూనాలో ఉంది. ఇది వర్క్ కల్చర్‌లో మార్పులను తీసుకురావడానికేనని అధికారులు చెబుతున్నారు.


స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రధాని కార్యాలయం సౌత్ బ్లాక్‌లోని రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో కలిసి ఉంది. నార్త్ బ్లాక్‌లో హోమ్, ఆర్దిక మంత్రిత్వ శాఖలు ఉండేవి. వీటిని ప్రస్తుతం కర్తవ్య భవన్‌లోని మార్చారు. బ్రిటిష్ కాలం నాటి ఈ సౌత్, నార్త్ బ్లాక్‌లను 5 వేల ఏళ్ల నాటి పురాతన భారతీయ నాగరికతను తెలియజేసే మ్యూజియంగా మార్చుతున్నారు. దీనికి సంబంధించిన తొలి దశను వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభించనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa