ప్రపంచ వేదికపై భారత్-అమెరికా మైత్రి సరికొత్త శిఖరాలకు చేరుతోంది. "అమెరికాకు భారత్ కంటే అత్యంత అవసరమైన దేశం మరొకటి లేదు" అంటూ భారత్లో అమెరికా రాయబారిగా నామినేట్ అయిన సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఆయన ప్రసంగిస్తూ.. ఇరు దేశాల మధ్య నెలకొన్న బంధాన్ని, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది (2027) భారత్లో పర్యటించే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు.
మోదీ, ట్రంప్.. నిజమైన స్నేహితులు
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న స్నేహం కేవలం దౌత్యపరమైనది కాదని.. అది నిజమైన స్నేహం అని సెర్గియో గోర్ కొనియాడారు. "నేను అధ్యక్షుడు ట్రంప్తో కలిసి ప్రపంచమంతా తిరిగాను.. మోదీతో ఆయనకున్న అనుబంధం ఎంత సహజమైనదో నేను స్వయంగా చూశాను. నిజమైన స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కానీ చివరికి వారు వాటన్నింటినీ పరిష్కరించుకుని ముందుకు సాగుతారు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య పెండింగ్లో ఉన్న వాణిజ్య వివాదాలు త్వరలోనే సమసిపోతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
చాలా కాలంగా ఆగిపోయిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు మంగళవారం (జనవరి 13వ తేదీ) నుంచి పునఃప్రారంభం కానున్నాయని గోర్ ప్రకటించారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశమని.. ఇక్కడ ఒప్పందాలను కొలిక్కి తీసుకురావడం అంత సులభం కాదని, కానీ తాము పట్టుదలతో పని చేసి విజయం సాధిస్తామని చెప్పారు. కేవలం వాణిజ్యమే కాకుండా రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక పోరు, ఇంధనం, సాంకేతికత, విద్య, ఆరోగ్య రంగాల్లో కూడా కలిసి పని చేయనున్నట్లు వెల్లడించారు.
'పాక్స్ సిలికా' కూటమిలోకి భారత్!
ఈ పర్యటనలో మరో కీలక ప్రకటన కూడా వెలువడింది. అమెరికా నేతృత్వంలోని ప్రతిష్టాత్మక 'పాక్స్ సిలికా' కూటమిలో భారత్కు పూర్తి స్థాయి సభ్యత్వం లభించనుంది. వచ్చే నెలలో భారత్ అధికారికంగా ఈ గ్రూపులో చేరుతుందని గోర్ వెల్లడించారు. సెమీ కండక్టర్లు, సిలికాన్ సరఫరా గొలుసును మరింత సురక్షితంగా, పటిష్టంగా మార్చేందుకు అమెరికా చేపట్టిన వ్యూహాత్మక చొరవ ఇది. ఈ సభ్యత్వం వల్ల భారత్ అంతర్జాతీయ సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఎదిగే అవకాశం ఉంది. మొత్తానికి.. ట్రంప్ రాబోయే పర్యటన, వాణిజ్య చర్చల పునరుద్ధరణతో భారత్-అమెరికా బంధం మరింత బలపడనుందని స్పష్టం అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa