ఇరాన్లో అట్టుడుకుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేసేందుకు అక్కడి పాలకులు విధిస్తున్న ఇంటర్నెట్ ఆంక్షలపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ ప్రజలకు తిరిగి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేలా ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్తో చర్చలు జరపనున్నట్లు ఆయన వెల్లడించారు. "అలాంటి పనులు చేయడంలో అతను (మస్క్) దిట్ట.. అతనికి అద్భుతమైన కంపెనీ ఉంది" అంటూ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు.
నిరసనకారుల కోసం స్టార్లింక్ అస్త్రం
ఇరాన్లో ప్రస్తుతం హిజాబ్ నిబంధనలు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఉపయోగించి.. ఇరాన్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా నిరసనకారులకు ఇంటర్నెట్ అందించాలని ట్రంప్ యోచిస్తున్నారు. గతంలో కూడా ఇరాన్, ఉక్రెయిన్ వంటి దేశాల్లో స్టార్లింక్ సేవలు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య సంబంధాలు గత కొంతకాలంగా చెడాయి. గతేడాది ట్రంప్ ప్రవేశ పెట్టిన పన్నుల బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ముఖ్యంగా ట్రంప్పై మస్క్ పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక పోస్టులు పెట్టారు. ఆ తర్వాత కొంత కాలానికే ట్రంప్కు క్షమాపణలు చెబుతూ ఓ పోస్టు కూడా పెట్టి గొడవను ఆపేశారు. అయితే తాజాగా ఈ నెలలో ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్లో వీరిద్దరూ కలిసి ఓ విందులో పాల్గొనడంతో.. వీరి స్నేహం మళ్లీ బలపడిందని స్పష్టం అవుతోంది.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ కానీ, ఆయన సంస్థ స్పేస్ ఎక్స్ కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయితే స్వేచ్ఛా ప్రపంచం కోసం ఇంటర్నెట్ అవసరమని భావించే మస్క్.. ట్రంప్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ స్టార్లింక్ ఇరాన్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. అది అక్కడి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa