ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అయితే, ఈ రోజుల్లో జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులతో పాటు జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక, మహిళలు పీరియడ్స్ నొప్పులతో బాధపడుతున్నారు.
ఈ సమస్యలతో పాటు పీరియడ్స్ పెయిన్స్ తగ్గించుకోవడానికి చాలా మంది మెడిసిన్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అయితే, ఇవి భవిష్యత్తులో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. గొంతు నొప్పి, అజీర్తి, పీరియడ్స్ నొప్పి వంటి 9 రకాల సమస్యల్ని తగ్గించడానికి ప్రముఖ డైటీషియన్ కొన్ని డ్రింక్స్ చెప్పారు.మందుల వాడకం తగ్గించి, వంటింటి పోపుల పెట్టెలోని ఔషధాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గొంతు నొప్పి
వాతావరణంలో మార్పుల వల్ల తరచూ గొంతు నొప్పి వస్తుంటుంది. ఇలాంటప్పుడు లవంగాల నీరు తాగాలని డాక్టర్ కాజల్ అగర్వాల్ సూచించారు. లవంగాల్లో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు గొంతులో ఇన్ఫెక్షన్ను తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి.
కడుపు ఉబ్బరం
చాలామందిని వేధించే ప్రధాన సమస్య కడుపు ఉబ్బరం. తిన్న ఆహారం సరిగ్గా అరగనప్పుడు కడుపు భారంగా అనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇంగువ, జీలకర్ర కలిపిన నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది గ్యాస్ సమస్యను తక్షణమే తగ్గిస్తుంది.
ఎసిడిటీ
మసాలా పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు లేదా సరైన సమయానికి ఆహారం తీసుకోనప్పుడు ఎసిడిటీ వస్తుంది. దీనికి సోంపు గింజల నీరు అద్భుతమైన విరుగుడు. ఇది కడుపులో మంటను తగ్గించి చల్లబరుస్తుంది.
పీరియడ్స్ నొప్పి
నెలసరి సమయంలో వచ్చే విపరీతమైన కడుపు నొప్పిని తగ్గించుకోవడానికి గోరువెచ్చని నీటిలో కొద్దిగా నెయ్యి కలుపుకొని తాగాలి. ఈ చిట్కా గర్భాశయ కండరాలకు ఉపశమనాన్ని ఇస్తుంది.
జలుబు, దగ్గు
జలుబు, దగ్గు ఇబ్బంది పెడుతున్నప్పుడు పసుపు, మిరియాల పొడి కలిపిన నీటిని తీసుకోవాలి. పసుపులోని కర్కుమిన్, మిరియాల్లోని పైపరీన్ కలిసి రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్తో పోరాడుతాయి. జలుబు, దగ్గును వెంటనే తగ్గిస్తాయి.
వాటర్ రిటెన్షన్
శరీరంలో అనవసరమైన నీరు చేరి కాళ్లు, చేతులు వాపు రావడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు ధనియాల నీరు తాగాలి. ఇది కిడ్నీల పనితీరును మెరుగుపరిచి శరీరంలోని వాపును తగ్గిస్తుంది.
అజీర్తి
భోజనం చేసిన తర్వాత కడుపు అసౌకర్యంగా ఉంటే వాము నీరు తీసుకోవడం ఉత్తమం. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి ఆహారం సులభంగా అరిగేలా చేస్తుంది.
నీరసం
శరీరంలో శక్తి తగ్గినట్లు అనిపించినప్పుడు లేదా అలసటగా ఉన్నప్పుడు ఒక గ్లాసు మజ్జిగ తాగాలి. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా హైడ్రేటెడ్గా ఉంచుతుంది.
నిద్రలేమి
రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టని వారు జాజికాయ నీటిని తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది మెదడును ప్రశాంతపరిచి గాఢ నిద్ర పట్టేలా సహకరిస్తుంది.
మన వంటిల్లే ఒక మెడికల్ షాప్ లాంటిది. ఎలాంటి ఆరోగ్య సమస్యకు ఏం వాడాలో తెలిస్తే సరిపోతుంది. సరైన అవగాహనతో వీటిని ఉపయోగిస్తే చిన్న చిన్న అనారోగ్యాలను సులభంగా నయం చేసుకోవచ్చని డాక్టర్ కాజల్ అగర్వాల్ చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa