ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఏడాది ఇదే అతిపెద్ద పందెం..కోడి పందెంలో కోటిన్నరకు పైగా గెలిచాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 15, 2026, 07:31 PM

సంక్రాంతి పండుగకు ఆకాశమంత ఉత్సాహాన్ని ఇచ్చేవి కోడి పందేలు. ఇవి లేకుంటే అసలు పండుగ సందడే ఉండదన్న రీతిలో ఈ కోడి పందేలు జరుగుతాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతాయి. బరుల వద్ద పందెం రాయుళ్లు, వీక్షకులతో గత కొద్ది రోజులుగా కోలాహలం నెలకొంది. పండుగ వేళ.. తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం (జనవరి 15) ఓ బరిలో జరిగిన కోడి పందెంలో.. ఓ వ్యక్తి జాక్ పాట్ కొట్టేశాడు. పందెం గెలిచి ఏకంగా కోటిన్నరకు పైగా సొంతం చేసుకున్నాడు.


సంక్రాంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో కోడి పందేలు జోరుగా సాగాయి. రెండో రోజూ కూడా రూ. కోట్లలో డబ్బులు చేతులు మారాయి. ఈ క్రమంలో పైబోయిన వెంకటరామయ్య బరిలో.. గుడివాడ ప్రభాకర్‌, రాజమండ్రి రమేష్‌ కోళ్ల మధ్య భారీ పందెం జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ పందెంలో రాజమండ్రి రమేష్‌ గెలుపొందాడు. దీంతో అతడు రూ. 1.53 కోట్లు బహుమతి సొంతం చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జరిగిన కోడి పందేల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే అతిపెద్ద పందెం అని స్థానికులు అంటున్నారు.


కాగా, గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పురుషులతో పాటు మహిళలు కూడా ఈ పందేల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వీటిని తిలకించేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి కోడి పందేలను కొన్ని చోట్ల వినూత్నంగా నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో కోడి పందేలను జూదంలా కాకుండా.. టోర్నమెంట్ లాగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.


కోడి పందేల్లో బెట్టింగ్‌లు వేయకుండా.. గెలిచిన వారికి ఖరీదైన బహుమతులు ఇస్తున్నారు. సంక్రాంతి మూడు రోజుల పాటు కోడి పందాలు నిర్వహిస్తుండగా.. చివరి రోజు విజయం సాధించిన వారికి మహీంద్రా థార్ వాహనం బహుమతిగా ఇవ్వనున్నట్లు పిఠాపురంలో ఇవ్వనున్నారు. కాగా, రెండో రోజు విజేతకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇచ్చేందుకు నిర్వాహకులు నిర్ణయించారు. కోడి పందాలను జూదంలా కాకుండా ఒక టోర్నీగా నిర్వహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కోడి పందేలు ఇలా జరిగే.. ఎవరూ ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa