ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలకు సంబంధించి వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఆసియాలోనే అత్యంత ధనిక మున్సిపల్ బాడీ అయిన బీఎంసీపై ఈసారి బీజేపీ-శివసేన (ఏకనాథ్ షిండే వర్గం) కూటమి జెండా పాతనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
బీఎంసీ పరిధిలో మొత్తం 227 స్థానాలు ఉండగా.. అందులో బీజేపీ, షిండే శివసేన నేతృత్వంలోని మహాయుతి కూటమి 131 నుంచి 151 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. అదే సమయంలో జేవీసీ 138 స్థానాలు వస్తాయని పేర్కొంది. సకల్ పోల్ సంస్థ మహాయుతి కూటమికి 119 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ, రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ కూటమికి 58 నుంచి 68 స్థానాలు మాత్రమే వస్తాయని యాక్సిస్ మై ఇండియా సంస్థ అంచనా వేసింది. 59 సీట్లు వస్తాయని జేవీసీ తెలిపింది. సకల్ పోల్ మాత్రం 75 స్థానాలు వస్తాయని పేర్కొంది.
ఇక ఈ బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి 12 నుంచి 16 స్థానాలు వస్తాయని యాక్సిస్ మై ఇండియా తెలిపింది. 23 సీట్లు వస్తాయని జేవీసీ అంచనా వేసింది. 20 స్థానాల్లో హస్తం పార్టీది విజయం అని సకల్ పోల్ అంచనా వేసింది.
సర్వే సంస్థ బీజేపీ + షిండే సేన ఉద్ధవ్ సేన + రాజ్ థాకరే కాంగ్రెస్ ఇతరులు
యాక్సిస్ మై ఇండియా 131-151 సీట్లు 58-68 సీట్లు 12-16 సీట్లు 6-12 సీట్లు
జేవీసీ 138 సీట్లు 59 సీట్లు 23 సీట్లు 7 సీట్లు
సకల్ పోల్ 119 సీట్లు 75 సీట్లు 20 సీట్లు 13 సీట్లు
మహారాష్ట్ర రాజకీయాల్లో దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి పోటీ చేసినప్పటికీ.. ముంబై ఓటర్లను వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారని సర్వేలు చెబుతున్నాయి. ఠాక్రే సోదరులకు మరాఠీ, ముస్లిం ఓటర్ల మద్దతు లభించినప్పటికీ.. ఉత్తర భారతీయులు, దక్షిణాది ఓటర్లు ఏకపక్షంగా బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు అంచనా వేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే యువ ఓటర్లు, మహిళా ఓటర్లు బీజేపీ-షిండే కూటమికే ప్రాధాన్యత ఇచ్చారని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. గురువారం జరిగిన బీఎంసీ ఎన్నికల్లో సుమారు 54 శాతం ఓటింగ్ నమోదైంది.
1985 నుంచి దాదాపుగా ముంబై బీఎంసీపై ఉమ్మడి శివసేన పార్టీ పట్టు ఉంది. ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమైతే.. సుమారు 40 ఏళ్ల తర్వాత ఠాక్రే కుటుంబం ముంబై కార్పొరేషన్పై పట్టు కోల్పోయినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసలైన శివసేన వారసులం తామే అని ఒకవైపు ఉద్ధవ్ ఠాక్రే శివసేన.. మరోవైపు.. షిండే శివసేన పార్టీలు హోరాహోరీగా పోరాటం చేస్తుండగా.. ఈ ఎన్నికల్లో వచ్చే విజయం.. వారి సత్తాను నిరూపించుకోవడానికి పెద్ద అవకాశంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa