బెంగళూరులో ఒక యువకుడు తన తల్లితో కలిసి నడుపుతున్న భారీ సైబర్ నేరాల నెట్వర్క్ను పోలీసులు ఛేదించారు. 22 ఏళ్ల బీకామ్ డ్రాపౌట్.. తన తల్లి సాయంతో వందల కోట్ల రూపాయల మేర హవాలా, సైబర్ మోసాలకు పాల్పడటం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న బెంగళూరుకు చెందిన మొహమ్మద్ ఉజైఫ్ (22), అతని తల్లి షబానా అబ్దుల్ బారిలను బెంగళూరు స్పెషల్ పోలీస్ టీమ్ అరెస్ట్ చేసింది. వీరితో పాటు ఢిల్లీకి చెందిన మరో 9 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉజైఫ్, అతని తల్లి షబానా ప్రభుత్వ ఆస్పత్రులు, కాలేజీల వద్ద తిరుగుతూ అమాయక ప్రజలను కలిసేవారు. వారికి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు కమిషన్ ఇస్తామని ఆశచూపించి.. వారి డాక్యుమెంట్లను తీసుకుని వారి పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించేవారు. అకౌంట్ ఓపెన్ అయిన వెంటనే వారి బ్యాంక్ పాస్బుక్కులు, డెబిట్ కార్డులు, ఆ అకౌంట్కు లింక్ అయిన సిమ్ కార్డులను ఆ తల్లీకొడుకులు తీసేసుకునేవారు.
ఆ తర్వాత ఇలా సేకరించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలను దుబాయ్లో ఉంటున్న ప్రేమ్ తనేజా (2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ నిందితుడు) అనే వ్యక్తికి పంపించేవారు. అక్కడి నుంచి సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును ఈ అకౌంట్లలోకి మళ్లించేవారు. బెంగళూరు పోలీసులు జరిపిన సోదాల్లో 242 డెబిట్ కార్డులు, 58 సెల్ఫోన్లు, 531 గ్రాముల బంగారం, రూ. 4.9 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా సుమారు 9 వేల బ్యాంక్ అకౌంట్లను మెయింటైన్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ అకౌంట్ల ద్వారా ఇప్పటివరకు రూ. 240 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ బ్యాంకు అకౌంట్లలో ఉన్న ఫండ్స్ను పోలీసులు ఫ్రీజ్ చేశారు.
బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఒక్క ముఠాకు భారతదేశం అంతటా నమోదైన కనీసం 864 సైబర్ నేరాల కేసులతో సంబంధం ఉందని గుర్తించారు. ప్రధాన నిందితుడు ప్రేమ్ తనేజాను దుబాయ్ నుంచి రప్పించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa