ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సగానికి తగ్గనున్న ప్రయాణ సమయం,,,,భారత్‌లోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే

national |  Suryaa Desk  | Published : Sat, Jan 17, 2026, 06:48 PM

దేశంలోనే అత్యంత పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఉత్తర్‌ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూపీఈఐడీఏ) వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఫిబ్రవరిలో ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రజలకు అందుబాటులోకి రానుంది. 594 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టు.. ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా నిలవనుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ (బిజౌలీ గ్రామం) నుంచి తూర్పున ఉన్న ప్రయాగ్‌రాజ్ (జుడాపూర్ దండు గ్రామం) వరకు సాగుతుంది. ఇది మొత్తం 12 జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్నారు.


మీరట్, హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభల్, బదౌన్, షాజహాన్‌పూర్, హర్దోయ్, ఉన్నావ్, రాయ్‌బరేలి, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ జిల్లాలను కలుపుతూ ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించారు. ప్రస్తుతం మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ చేరుకోవడానికి సాధారణంగా 12 గంటల నుంచి 13 గంటల సమయం పడుతుంది. గంగా ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి వస్తే.. ఈ సమయం కేవలం 6 గంటల నుంచి 8 గంటలకు తగ్గిపోతుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా రవాణా వేగవంతం అవుతుంది.


ఇటీవల బదౌన్ జిల్లాలో నిర్వహించిన టోల్ ప్లాజా ట్రయల్ రన్ సక్సెస్ అయింది. వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగకుండానే ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా ఆటోమేటిక్‌గా గేట్లు తెరుచుకునే విధానాన్ని పరీక్షించారు. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించి.. వాహనదారులు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించడానికి సహాయపడుతుంది. ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌వే నాణ్యతను పెంచడానికి స్విట్జర్లాండ్‌కు చెందిన 'ఈటీహెచ్ జ్యూరిచ్ యూనివర్సిటీ', 'ఆర్‌టీడీటీ లేబొరేటరీస్' భాగస్వామ్యంతో సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.


రోడ్డుపై ఉండే కుదుపులు, సౌకర్యాన్ని కొలవడానికి 7 సెన్సార్లు కలిగిన ప్రత్యేక వాహనంతో తనిఖీలు చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడే ఎక్కడైనా లోపాలు ఉంటే ఈ సెన్సార్లు వెంటనే గుర్తిస్తాయి. తద్వారా వాటిని వెనువెంటనే సరిదిద్దే అవకాశం ఉంటుంది. ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌వే 140 నదులు, జలవనరులను దాటుతుంది. ఈ ప్రాజెక్టులో 14 మేజర్ పెద్ద వంతెనలు.. 126 మైనర్ చిన్న వంతెనలు ఉన్నాయి. 28 ఫ్లై ఓవర్లు, 50 వెహికల్ అండర్‌పాస్‌లు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాల ల్యాండింగ్ కోసం షాజహాన్‌పూర్‌లో 3.5 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa