మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ విభాగం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో విజయసాయి రెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. జనవరి 22న ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 2019 నుండి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన మద్యం విధానంపై దర్యాప్తులో భాగంగా విజయసాయి రెడ్డిని ప్రశ్నించనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ దర్యాప్తు జరుగుతోంది.
ఏపీ లిక్కర్ స్కామ్లో భారీగా లంచాలు తీసుకోవడం, నిధులు మళ్లించడం వంటి ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మద్యం కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించగా.. తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ కావడం సంచలనంగా మారింది. ఈ కేసును ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా విచారిస్తోంది. సిట్ ప్రకారం, గత వైసీపీ ప్రభుత్వం కొత్త మద్యం విధానం ద్వారా సరఫరాదారుల నుండి 15 నుంచి 20 శాతం వరకు లంచాలు వసూలు చేసిందని ఆరోపణలున్నాయి. లంచాలు ఇవ్వడానికి నిరాకరించిన ప్రముఖ మద్యం బ్రాండ్లను పక్కన పెట్టారని కూడా సిట్ తెలిపింది.
తదర్యాప్తు అధికారులు చెప్పిన దాని ప్రకారం, ఆటోమేటిక్ కొనుగోలు వ్యవస్థను తీసివేసి, మాన్యువల్ అనుమతులకు మార్చారు. దీనివల్ల సరఫరా ఆర్డర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. నకిలీ డిస్టిలరీలను ఏర్పాటు చేసి, ఎక్కువ మొత్తంలో సరఫరా ఆర్డర్లు పొంది, నకిలీ లావాదేవీల ద్వారా నిధులను మళ్లించారని కూడా ఆరోపణలున్నాయి. ఈడీ ఆరోపణల ప్రకారం, అర్హత ప్రమాణాలను మార్చి, సరఫరాదారులను లంచాలు ఇవ్వాలని బలవంతం చేశారు. నకిలీ విక్రేతల చెల్లింపులు, అధిక ధరల బిల్లులు, నకిలీ కంపెనీల ద్వారా లంచాలు సేకరించి, ఎన్నికల కోసం, వ్యక్తిగత లాభాల కోసం విదేశాలకు తరలించారని ఈడీ ఆరోపించింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) మద్యం సరఫరాదారులకు చెల్లించిన మొత్తంలో కొంత భాగాన్ని, వస్తువులు, సేవల కోసం చెల్లింపుల మాటున వివిధ కంపెనీలకు మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. ఇలాంటి అనేక నకిలీవి, అధిక ధరలతో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో, నగదు, బంగారం కొనుగోలు చేయడానికి ఈ నిధులను నగల వ్యాపారులకు మళ్లించి, ఆ తర్వాత వాటిని నిందితులకు అప్పగించారని కూడా దర్యాప్తు అధికారులు ఆరోపించారు.
2019 నుండి 2024 మధ్యకాలంలో 16 మద్యం కంపెనీలు ఏపీఎస్బీసీఎల్ నుండి సరఫరా ఆర్డర్లు పొందడానికి లంచాలు చెల్లించాయని సిట్ దర్యప్తులో వెల్లడైంది. ఈ కాంట్రాక్టుల విలువ రూ.10,835 కోట్లుగా తేల్చింది. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన రూ.23,000 కోట్ల సరఫరా ఆర్డర్లలో ఇవి భాగం అని గుర్తించారు. లంచాల రూపంలో రూ.3,500 కోట్లకు పైగా నిధులు అనేక లావాదేవీల ద్వారా మళ్లించబడ్డాయని సిట్ అంచనా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa