సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సులను గుర్తించి, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,896 ప్రైవేటు బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. వీటిలో ప్రధానంగా పండుగ పూట సామాన్యులను దోచుకుంటున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న 548 బస్సులపై కేసులు బుక్ చేశారు. పండుగ సమయంలో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడకుండా రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
కేవలం అధిక ఛార్జీలే కాకుండా, సాంకేతిక నిబంధనలు పాటించని బస్సులపై కూడా అధికారులు ఉక్కుపాదం మోపారు. పన్ను ఎగవేత, చెల్లుబాటు అయ్యే పర్మిట్లు లేకపోవడం, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపైకి రావడం వంటి వివిధ రకాల ఉల్లంఘనలకు సంబంధించి ఏకంగా 1,348 కేసులు నమోదు చేశారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ సరైన పత్రాలు లేకుండా నడుపుతున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి సీజ్ చేశారు.
నిబంధనలు అతిక్రమించిన సదరు ట్రావెల్స్ సంస్థలపై అధికారులు మొత్తంగా రూ.1.27 కోట్ల మేర భారీ జరిమానాలను విధించారు. భవిష్యత్తులో కూడా ప్రైవేటు ఆపరేటర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. పండుగలు లేదా సెలవుల సమయంలో ప్రయాణికుల సౌకర్యం మరియు భద్రత తమ మొదటి ప్రాధాన్యత అని, ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని రవాణా శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa