రాజస్థాన్కు చెందిన ఓ మహిళా రైతు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అరుదైన గౌరవం దక్కించుకుంది. సాగుకు ఏమాత్రం అనుకూలం కాని బీడు భూముల్లో దానిమ్మ, యాపిల్ వంటి పండ్లను పండించి, రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఎంపికైంది. సికార్ జిల్లాలోని బేరీ గ్రామానికి చెందిన సంతోష్ దేవి తన సంకల్ప బలంతో ఈ ఘనత సాధించింది.పోస్టులో వచ్చిన ఈ ప్రత్యేక ఆహ్వానం గురించి తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన 17 ఏళ్ల కఠోర శ్రమ, పోరాటానికి దక్కిన ఫలితమే ఈ గౌరవమని సంతోష్ దేవి ఆనందం వ్యక్తం చేసింది. మూడు రోజుల క్రితం రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందిందని, అప్పటి నుంచి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపింది.రసాయనాలు లేని సేంద్రియ పద్ధతిలో దానిమ్మ, యాపిల్, జామ పండ్లను సంతోష్ దేవి సాగు చేస్తోంది. ఆమె పొలంలో పండిన దానిమ్మ పండ్లు 800 గ్రాముల వరకు, యాపిల్స్ 200 గ్రాముల వరకు బరువు తూగుతుండటం విశేషం. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా బయటకు వచ్చి స్వయం సమృద్ధి సాధించాలని ఆమె పిలుపునిచ్చింది. వ్యవసాయం లాభదాయకం కాదనే వాదనను తాను తప్పని నిరూపించానని, ఒకప్పుడు తన భర్త ఆదాయం రూ.3,000 కాగా, ఇప్పుడు తాను వ్యవసాయం ద్వారా నెలకు రూ.40,000 సంపాదిస్తున్నట్లు వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa