స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యూరిచ్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మిస్తున్నామని, రాబోయే రోజుల్లో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులతో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ప్రభావం చూపగల కమ్యూనిటీగా ఎదగాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "ఒకప్పుడు నేను దావోస్కు వచ్చినప్పుడు భారతీయులే తక్కువగా ఉండేవారు, తెలుగువారు అసలు కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ 20 దేశాల నుంచి వచ్చిన తెలుగువారిని చూస్తుంటే విజయవాడలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా అనేంత సంతోషంగా ఉంది" అని అన్నారు. విదేశాల్లో ఉన్నా మన సంప్రదాయాలను పాటిస్తున్నారని, కోడిపందాలు తప్ప సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారని ప్రశంసించారు. తాను గతంలో విజన్ 2020, ఐటీ గురించి మాట్లాడినప్పుడు విమర్శలు వచ్చాయని, కానీ ఆనాటి నిర్ణయాల వల్లే నేడు తెలుగువారు 195 దేశాలకు వెళ్లగలిగారని గుర్తుచేశారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నార్టీల పాత్ర అద్భుతమని కొనియాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే సదుద్దేశంతో పవన్ కల్యాణ్, బీజేపీ కలిసి వచ్చాయని తెలిపారు. "రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావాలని కోరగానే, ఎన్నార్టీలు ఆలోచించకుండా తరలివచ్చి కూటమి కోసం పనిచేశారు. కొందరు కార్యకర్తలతో సమానంగా కేసులు కూడా ఎదుర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, మీ అందరి సహకారంతో 93 శాతం స్ట్రైక్ రేట్తో అద్భుత విజయం సాధించాం," అని చంద్రబాబు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa