భారత్ – న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మరో మూడు వారాల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్కు ఇది టీమిండియాకు చివరి రిహార్సల్ లాంటిదే. అయితే ఈ సిరీస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు అసలైన పరీక్ష అని చెప్పొచ్చు. కేవలం కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా కూడా స్కై తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది.
2024 నుంచి భారత టీ20 జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ మంచి విజయ శాతంతో దూసుకెళ్తున్నాడు. అతని నాయకత్వంలో భారత్ 70 శాతం పైగా మ్యాచ్లు గెలిచింది. కానీ ఈ విజయాల వెనుక సూర్య వ్యక్తిగత బ్యాటింగ్ ఫామ్ పూర్తిగా కనుమరుగయింది. ఇప్పుడు వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ ఆ లోపమే పెద్ద ప్రశ్నగా మారింది. 2025లో సూర్యకుమార్ భారత్ తరఫున ఆడిన 19 టీ20 మ్యాచ్ల్లో కేవలం 218 పరుగులే చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
గత రెండేళ్లుగా భారత టీ20 జట్టు టాప్ క్లాస్ ప్రదర్శన చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగుతోన్న సూర్యకుమార్ యాదవ్ సేనకు స్వదేశంలో వరల్డ్ కప్ టైటిల్ను కాపాడాల్సిన బాధ్యత తమ భుజాలపై పడింది. న్యూజిలాండ్ జట్టు కూడా ఈ మధ్య కాలంలో భారత్పై చరిత్ర సృష్టించింది. టెస్టు సిరీస్ వైట్వాష్, వన్డే సిరీస్ విజయం వంటి ఘనతలు సాధించింది.
టీ20 ఫార్మాట్లో మాత్రం సూర్య నాయకత్వంలోని భారత్ వేరే స్థాయిలో ఉంది. 25 మ్యాచ్లలో 18 విజయాలు సాధించడంలో అభిషేక్ శర్మ వేగవంతమైన ఆరంభాలు, వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్ల మాయ కీలకంగా నిలిచాయి. ఈ సిరీస్తో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం భారత్కు పెద్ద ఊరట. హార్దిక్ అందించే బ్యాలెన్స్ వల్ల అదనపు స్పెషలిస్ట్ను ఆడించే అవకాశం లభిస్తుంది. వరుణ్ చక్రవర్తి కూడా న్యూజిలాండ్కు తెలియని ఎక్స్ ఫ్యాక్టర్గా మారనున్నాడు.
షెడ్యూల్ ఇదే
జనవరి 21 నుంచి 31వ తేదీ వరకు భారత్ - న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. తొలిమ్యాచ్ రేపు నాగ్పూర్ వేదికగా జరగనుండగా, రెండోది జనవరి 23 రాయ్పూర్లో, మూడోది గువాహటిలో జనవరి 25న, నాలుగో మ్యాచ్ జనవరి 28న విశాఖ వేదికగా, చివరి టీ20 తిరువనంతపురంలో జనవరి 31న జరగనుంది. అన్ని మ్యాచ్లు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.
టీమిండియా స్క్వాడ్
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa