ఇటీవల దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కేరళ బస్సు వేధింపుల ఆరోపణల వ్యవహారం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోగా.. ఈ కేసులో మహిళను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఇటీవల తాను బస్సులో ప్రయాణిస్తుండగా.. ఓ వ్యక్తి తనను వేధించాడంటూ కేరళకు చెందిన మహిళా ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టింది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ కావడంతో తీవ్ర అవమానంగా భావించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి ఏం చేయకపోయినా.. కావాలనే ఆ మహిళ సోషల్ మీడియాలో వైరల్ కావాలని.. అసత్య ఆరోపణలు చేసి.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంతో.. పోలీసులు వెతకగా ఆమె ఆచూకీ దొరకలేదు. తాజాగా బుధవారం ఆమెను అరెస్ట్ చేశారు.
కేరళకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షిమ్జిత ముస్తఫా అనే 35 ఏళ్ల మహిళ గత వారం బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి తనను ఉద్దేశపూర్వకంగా తాకుతూ లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా.. అది దాదాపు 20 లక్షల వ్యూస్ పొంది వైరల్ అయ్యింది.
పుట్టినరోజు నాడే విషాదం
ఆ వీడియో వైరల్ కావడంతో దీపక్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. శనివారం తన పుట్టినరోజు ఉన్నప్పటికీ.. ఈ వైరల్ వీడియో అవమానంతో రెండు రోజులుగా అతను ఆహారం కూడా తీసుకోలేదు. చివరకు ఆదివారం కోజికోడ్లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడు అమాయకుడని.. ఎప్పుడూ ఏ తప్పూ చేయలేదని.. కేవలం సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ఆరోపణల వల్లే ప్రాణాలు కోల్పోయాడని అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పోలీసు చర్యలు
దీపక్ ఆత్మహత్య తర్వాత ముస్తఫా ఆ వీడియోను తొలగించింది. అంతేకాకుండా తనను తాను సమర్థించుకుంటూ మరో వీడియోను పోస్ట్ చేసింది. అయితే.. దీపక్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేశారు. కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు బుధవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ముస్తఫాపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన వైరల్ కావడంతో.. కేరళ బస్సుల్లో పురుషులు ఎవరికీ తగలకుండా ఉండేందుకు తమ చుట్టూ బాక్స్లు ఏర్పాటు చేసుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa