ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాత్రంతా కాపలా కాసి,,,యజమాని ఆత్మహత్య అంత్యక్రియల్లో పాల్గొన్న పెంపుడు కుక్క

national |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 09:33 PM

మనిషికి మనిషి తోడుంటాడో లేదో తెలియదు గానీ మూగజీవాలు మాత్రం ప్రాణం ఉన్నప్పుడే కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా తమ యజమాని పట్ల అంతులేని విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంటాయి. మధ్య ప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారక ఘటన ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. తన యజమాని ఆత్మహత్య చేసుకున్నాడని గ్రహించిన పెంపుడు కుక్క.. ఆ మృతదేహం పక్కనే ఉండి కాపలా కాసింది. ఆపై కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని అంత్యక్రియలు నిర్వహించగా.. అందులోనూ పాల్గొని అందరి చేత కంటతడి పెట్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతోంది.


శివపురి జిల్లాకు చెందిన 40 ఏళ్ల జగదీష్ ప్రజాపతి.. సోమవారం రోజు తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లి చూసే సరికి జగదీష్ ప్రాణాల్లేకుండా ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. అయితే ఆ శవం కిందే ఆయన పెంపుడు కుక్క నిశ్శబ్దంగా కూర్చుని ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా తన యజమాని ఇక లేడన్న విషయం దానికి అర్థమైందో లేదో తెలియదు గానీ.. అది రాత్రంతా ఆ మృతదేహాన్ని వదలకుండా కాపలా కాయడం, దాని కళ్ల వెంట నీళ్లు కారడం చూసి అంతా షాకయ్యారు.


 4 కిలోమీటర్లు పరుగెత్తుతూ..


మరుసటి రోజు ఉదయం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరేరా పట్టణానికి తరలించడానికి ట్రాక్టర్‌లో ఎక్కించారు. అయితే తన యజమాని మృతదేహాన్ని ట్రాక్టర్‌లో ఎక్కించడం చూసిన శునకం.. దాని వెనకాలే పరుగులు పెట్టింది. దాదాపు నాలుగు కిలో మీటర్లు ఆ వాహనం వెనుకే పరిగెత్తగా.. విషయం గుర్తించిన ట్రాక్టర్‌లోని వ్యక్తులు దాన్ని కూడా ఎక్కించుకున్నారు. దీంతో యజమాని మృతదేహం పక్కనే.. ఆ కుక్క దిగాలుగా కూర్చుంది. ఆపై ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం పూర్తయ్యే వరకు వేచి చూసి, తిరిగి ఇంటికి మృతదేహంతో పాటే అదే ట్రాక్టర్‌లో తిరిగొచ్చింది.


చితి వద్దే మౌన దీక్ష..


స్మశాన వాటికలో కూడా జగదీష్ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఆ కుక్క ప్రవర్తన అక్కడి వారిని మరింత కలచివేసింది. చితి వెలిగించిన తర్వాత కూడా అది అక్కడి నుంచి కదలలేదు. కుటుంబ సభ్యులు అన్నం, నీళ్లు పెట్టినా ముట్టుకోలేదు. కేవలం తన యజమాని కాలిపోతున్న దృశ్యాన్ని మౌనంగా చూస్తూ అక్కడే కూర్చుండిపోయింది. అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది సైతం ఆ కుక్క చూపిన ప్రేమను చూసి ఆశ్చర్యపోయారు. స్థానిక స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఇది చూసిన వారంతా తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మనుషుల మధ్య బంధాలు బలహీనపడుతున్న ఈ రోజుల్లో.. కుక్క ఇంతటి విశ్వాసం చూపడం నిజంగా గ్రేట్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పోలీసులు జగదీష్ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa