ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్.. ఆఖర్లో రింకూ బౌండరీల మోత

sports |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 11:07 PM

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీతో స్టేడియాన్ని దద్దరిల్లించాడు. తొలి ఓవర్ నుంచే భారీ సిక్సర్లు బాదిన అభిషేక్ శర్మ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. శర్మ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోతే.. టీ20 వరల్డ్‌కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్‌లో అభిషేక్‌తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా రాణించడం ఆఖర్లో రింకూ సింగ్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో మేనేజ్‌మెంట్ ఫుల్ హ్యాపీగా ఉంది.


నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇన్నింగ్స్‌ను నిదానంగా ఆరంభించిన సంజు శాంసన్ 7 బంతుల్లో వరుసగా రెండు బౌండరీలు బాది పది పరుగులే చేసి వికెట్ కోల్పోయాడు. ఆ వెంటనే వచ్చిన ఇషాన్ కిషన్ బౌండరీ‌తో ఇన్నింగ్స్ ఆరంభించి 5 బంతుల్లో 8 పరుగులు చేసి అవుటయ్యాడు.


మూడు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా స్కోర్ బోర్డును అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరుగులు పెట్టించారు. అభిషేక్ శర్మ సిక్సర్ల మోత మోగిస్తుండగా, సూర్యకుమార్ బౌండరీలు బాదాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ శర్మ.. న్యూజిలాండ్‌పై అతి తక్కువ బంతుల్లో 50 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.


సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 32 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ - సూర్య మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. 35 బంతులు ఆడిన అభిషేక్ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 84 పరుగులు చేసి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.


అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు ఓవర్‌కి 12 పరుగులు ఉన్న రన్‌రేట్ ఆ తర్వాత పడిపోయింది. అభిషేక్ శర్మ అవుటయ్యే సమయానికి కేవలం 12 ఓవర్లలోనే భారత్ 149 పరుగులు చేసింది. శివమ్ దుబే 4 బంతుల్లో 9 పరుగులతో బౌలర్‌కి ఈజీ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 25 పరుగులు చేసిన హార్దిక్ సిక్సర్‌కి ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద వికెట్ కోల్పోయాడు.


హిట్టర్లంతా వెంటవెంటనే అవుటవ్వడంతో ఆఖర్లో స్కోర్ బోర్డు నిదానంగా సాగింది. కానీ చివరి ఓవర్‌లో రింకూ సింగ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. డారిల్ మిచెల్ వేసిన 20వ ఓవర్‌లో మొదటి రెండు బంతుల్లో సిక్సర్లు బాదిన రింకూ సింగ్ నాలుగో బంతి, ఆరో బంతిని ఫోర్‌గా మలిచాడు. రింకూ సింగ్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ మొత్తం 21 ఫోర్లు, 14 సిక్సర్లతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa