చట్టం కళ్లు కప్పి ఎంతకాలం తప్పించుకున్నా.. ఏదో ఒకరోజు బేడీలు పడాల్సిందే, జైలుకు వెళ్లాల్సిందే అనే మాటలను రుజువు చేశాడో వ్యక్తి. ముఖ్యంగా 20 ఏళ్ల క్రితం ఓ చిన్న దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని.. తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 4 వేల రూపాయల విలువైన వస్తువు దొంగిలించిన అతడిని.. ఏళ్ల పాటు వెతికినా లాభం లేకపోవడంతో తాజాగా పక్కాగా ప్లాన్ వేసి మరీ పట్టుకున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
అసలు ఏం జరిగిందంటే..?
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా షాహుపురి కాలనీకి చెందిన అరవింద్ విఠల్ రావు భోసలే అనే వ్యక్తి.. 2006 జూలై 10వ తేదీన రాత్రి తన ఇంటి బయట కారును పార్క్ చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తి ఆ కారు అద్దాలు పగలగొట్టి, అందులోని సుమారు రూ. 4,000 విలువైన కార్ స్టీరియోను ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శివాజీనగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు. ఆపై పోలీసులు దర్యాప్తు చేపట్టి.. అదే ఏడాది జూలై 14వ తేదీన బుధోడ గ్రామానికి చెందిన బాబు లక్ష్మణ్ సంకోలే (అప్పుడు 21 ఏళ్లు) అనే నిందితుడిని అరెస్ట్ చేశారు.
అయితే ఆ తర్వాత కొంత కాలానికే నిందితుడు బెయిల్పై బయటకు వచ్చాడు. అయితే కోర్టు విచారణకు హాజరు కావాల్సిన సంకోలే.. అప్పటి నుంచి పరారయ్యాడు. బెయిల్పై వచ్చినప్పటి నుంచి బాబు లక్ష్మణ్ పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు. పదేపదే తన నివాసాన్ని మారుస్తూ.. ఒక చోట ఉండకుండా తిరుగుతూ పోలీసుల కళ్లుగప్పాడు. దీంతో పోలీసులు అతడి జాడను కనుగొనలేకపోయారు. కాలక్రమేణా ఈ కేసు సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కేసుల్లో ఒకటిగా మారిపోయింది. మరోవైపు నిందితుడు కూడా పోలీసులు వెతకడం మానేశారనుకుని.. హాయిగా కాలం గడుపుతున్నాడు.
ఇదంతా బాగానే ఉండగా.. తాజాగా పాత కేసులను పరిష్కరించేందుకు లాతూర్ పోలీసులు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక బృందం ఈ కేసును మళ్లీ బయటకు తీసింది. నిందితుడి పాత చిరునామాలు, అతడి బంధువుల వివరాలను సేకరించి నిఘా పెంచింది. ప్రత్యేక బృందానికి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం 41 ఏళ్ల వయస్సు ఉన్న సంకోలే, అవూసా తహసీల్లోని యాకత్పూర్ రోడ్డులో నివసిస్తున్నాడని తెలిసింది. అంతేకాకుండా కమల్పూర్-ఉజానీ ప్రాంతంలో చెరకు కోత కూలీగా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పక్కా ప్లాన్ వేసిన పోలీసులు.. అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడిని మంగళవారం స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టగా.. న్యాయస్థానం అతడికి జనవరి 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa