ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రెడిట్ కార్డు వడ్డీలపై నియంత్రణ ఉంచండి.... నిర్మలమ్మకు ఏపీ ఎంపీ రిక్వెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 08:04 PM

క్రెడిట్ కార్డు అనేది నిత్యావసరంగా మారిపోయింది. గతంలో తక్కువే కానీ.. ఇప్పుడు చాలా మంది ఉపయోగిస్తున్నారు. క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు కారణం ఏదైతేనేం.. క్రెడిట్ కార్డు వాడకమనేది గతంతో పోలిస్తే చాలా పెరిగిపోయింది. అయితే క్రెడిట్ కార్డు వాడేవారిని ఇబ్బందిపెట్టే సమస్య క్రెడిట్ కార్డు వడ్డీ రేటు. ఒక్కో బ్యాంక్ ఒక్కో రకంగా క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లను వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లపై నియంత్రణ ఉంచాలంటూ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు దగ్గుబాటి పురందేశ్వరి వినతిపత్రం సమర్పించారు. అమెరికా తరహాలోనే మన దేశంలోనూ క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లపై పరిమితి ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


మన దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై 24 శాతం నుంచి 48 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తు్న్నారని.. కొన్ని చోట్ల 55 శాతానికి పైగా వార్షిక వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలు విధించడం సాధారణ ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోందని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. వినియోగదారులను దోపిడీ రుణ విధానాల నుంచి రక్షించడమే లక్ష్యంగా అమెరికాలో, అక్కడి ప్రభుత్వం క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10శాతానికి పరిమితం చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చిందని పురందేశ్వరి వినతి పత్రంలో పేర్కొ్న్నారు. మన దేశం కూడా అమెరికా తరహాలో క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు , పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.


ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా, వినియోగదారుల హితం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ వినతిపత్రంలో దగ్గుబాటి పురందేశ్వరి పలు అంశాలు ప్రస్తావించారు. ఇతర రుణ మార్గాలతో పోలిస్తే క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని పురందేశ్వరి గుర్తు చేశారు. అలాగే చాలా మంది వినియోగదారులకు తమ క్రెడిట్ కార్డుల మీద ఎంత వడ్డీ పడుతోంది, ఎన్ని ఛార్జీలు పడుతున్నాయనే విషయంపై కనీస అవగాహన ఉండటం లేదన్నారు.


కొన్ని సంస్థలు వినియోగదారుల నుంచి అధిక వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ వినతిని పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ కార్డు వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని దగ్గుబాటి పురందేశ్వరి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa