రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అంటేనే విరాట్ కోహ్లీ, కోహ్లీ అంటేనే RCB అన్నంతలా విడదీయలేని బంధం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ బంధం మరో మెట్టు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. కోహ్లీ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఈ ఫ్రాంచైజీలో వాటా దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కేవలం స్టార్ ప్లేయర్ భార్యగానే కాకుండా, జట్టులో ఒక భాగస్వామిగా (Owner) ఉండాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.
ఈ డీల్ విలువ కూడా భారీ స్థాయిలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు రూ. 400 కోట్లు వెచ్చించి ఈ ఫ్రాంచైజీలో 3 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అనుష్క బిడ్ వేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్లో అత్యధిక బ్రాండ్ వాల్యూ ఉన్న జట్లలో ఆర్సీబీ ఒకటి కావడంతో, ఈ పెట్టుబడి భవిష్యత్తులో మరింత లాభదాయకంగా ఉంటుందని ఆమె భావిస్తున్నట్లు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు అనుష్క శర్మ గానీ, ఆర్సీబీ యాజమాన్యం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఒకవేళ ఈ డీల్ నిజమైతే, ఐపీఎల్లో స్టార్ కపుల్ సందడి మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే కోహ్లీ ఈ జట్టుకు వెన్నెముకలా ఉండగా, ఇప్పుడు అనుష్క మేనేజ్మెంట్ వైపు నుంచి తోడవ్వడం అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్త అదర్ పూనావాలా కూడా ఆర్సీబీలో వాటా కోసం బిడ్ వేస్తానని బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఫ్రాంచైజీలో వాటా దక్కించుకోవడం కోసం గట్టి పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం కోహ్లీ కేవలం ఆటగాడిగా మాత్రమే ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ అనుష్క వాటాదారుగా మారితే, ఒకే ఫ్రాంచైజీలో భార్య యజమానిగా, భర్త ఆటగాడిగా ఉండటం ఒక అరుదైన రికార్డుగా నిలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతుండటంతో, తదుపరి ఐపీఎల్ సీజన్ నాటికి ఆర్సీబీ యాజమాన్య నిర్మాణంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa