అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో అయినవారికి అడ్డగోలు భూకేటాయింపులు చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో భూదోపిడీకి సిద్ధమైందని వైయస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మంత్రి లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ కు చెందిన గీతం సంస్థ 54 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే... దాన్ని రెగ్యులరైజ్ చేస్తున్న ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీ భరత్ కు చెందిన గీతం సంస్థ రూ.5వేల కోట్ల విలువైన భూమిని ఆక్రమిస్తే.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టాల్సింది పోయి.. రెగ్యులరైజ్ చేయాలన్న నిర్ణయం ప్రభుత్వ బరితెగింపుకు ప్రత్యక్షనిదర్శనమని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి రాచరిక పోకడలు సరికాదని.. ప్రభుత్వ ఆస్తులకు కస్టోడియన్స్ గా ఉండాల్సిన వారే కాటేసే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రెండేళ్లుగా అక్రమ కేటాయింపులతో కూటమి ప్రభుత్వం విశాఖలో ప్రభుత్వ భూమి హారతి కర్పూరంలా కరిగిస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కితీసుకునేంత వరకు వైయస్.జగన్ నేతృత్వంలో వైయస్ఆర్సీపీ పోరాటం తధ్యమని అమర్ స్పష్టం చేశారు. 18 నెలల పాలనలో రూ.3 లక్షల కోట్లు అప్పు ప్రజల నెత్తిన పెట్టిన ప్రభుత్వం.. తమ వారికి మాత్రం రూ. 30 వేల కోట్ల భూసంతర్పణ చేసిందని తేల్చి చెప్పారు. దావోస్ పర్యటనకు రూ.25 కోట్లు ప్రజా ధనం వృధా చేసిన చంద్రబాబు.. పెట్టుబడులేవీ లేకుండానే వట్టి చేతులతో తిరిగొస్తే.. అనుకూల మీడియాలో మాత్రం దావోస్ మ్యాన్ అంటూ డబ్బా కొట్టుకోవడాన్ని తప్పు పట్టారు. మరోవైపు తిరుమల లడ్డూ విషయంలోనూ సీఎం చంద్రబాబు అభాసుపాలయ్యారని అమర్నాధ్ స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదన్న దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ తో బాబు నీచ రాజకీయం బట్టబయలైందన్నారు. మరోవైపు అన్నవరం ప్రసాదం కౌంటర్లో స్వైరవిహారం చేస్తున్న ఎలుకలు... నిర్వహణ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని తేల్చి చెప్పారు. చివరకు ప్రసాదం పవిత్రను కూడా కూటమి ప్రభుత్వం నీరుగార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa