భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. కివీస్ ఇచ్చిన 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించి భారత్ రికార్డు సృష్టించింది. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. దాంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో మరో రెండు రెండు మ్యాచ్లు మిగిలుండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.
గువాహటి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. టీమిండియా బౌలర్లు చాకచక్యంగా బౌలింగ్ చేయడంతో పాటు బుమ్రా ఫామ్లోకి రావడంతో కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. గ్లెన్ ఫిలిప్స్ మినహా మిగతా ఏ బ్యాటర్ రాణించకపోవడంతో న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది.
కివీస్ ఇచ్చిన 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ లేని కారణంగా ఇబ్బందిపడుతున్న సంజు శాంసన్ మ్యాట్ హెన్రీ వేసిన మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తన బ్యాట్కి పదునుపెట్టి ఆరంభం నుంచే బౌండరీలు బాదాడు.
ఇషాన్ కిషన్ వరుస బౌండరీలతో భారత్ స్కోర్ బోర్డు దూసుకుపోయింది. 13 బంతులు ఆడిన ఇషాన్ కిషన్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇషాన్ దూకుడుతో భారత్ 3.1 ఓవర్కే 50 పరుగులు పూర్తి చేసుకుంది. ఇషాన్ అవుటైన తర్వాత అభిషేక్ శర్మ - కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కివీస్ బౌలర్లకు చుక్కలు చూయించారు.
అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి మరోసారి రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ 94 పరుగులు చేసి సెకండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ నమోదు చేసింది. పేస్, స్పిన్ అన్న తేడా లేకుండా అభిషేక్, సూర్య బౌండరీల మోత మోగించారు. అభిషేక్ 14 బంతుల్లో ఫిఫ్టీ నమోదు చేస్తే, సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 50 పరుగులు చేసి బ్యాక్ టు బ్యాక్ ఫిఫ్టీ నమోదు చేశాడు.
అభిషేక్ శర్మ 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సంజు 0, ఇషాన్ కిషన్ 28 పరుగులు చేయడంతో భారత్ కేవలం 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 3-0తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa