న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి అదరగొట్టింది. గువహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. తొలుత బౌలింగ్లో అదరగొట్టి కివీస్ను 153 పరుగులకే కట్టడి చేసిన భారత్, అనంతరం అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక హాఫ్ సెంచరీలతో కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు తొలి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ (0) డకౌట్గా వెనుదిరిగాడు. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 28), మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరూ కేవలం 19 బంతుల్లోనే 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్తో కలిసి విధ్వంసం సృష్టించాడు. తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటూ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సూర్య 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అభిషేక్ శర్మ కూడా కేవలం 20 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ మూడో వికెట్కు అజేయంగా 40 బంతుల్లోనే 102 పరుగులు జోడించడం విశేషం.అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్, కివీస్ను ఆది నుంచే దెబ్బతీసింది. భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 48), మార్క్ చాప్మన్ (23 బంతుల్లో 32) నాలుగో వికెట్కు 52 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని రవి బిష్ణోయ్ విడదీయడంతో కివీస్ మళ్లీ కుప్పకూలింది. చివర్లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (17 బంతుల్లో 27) కాస్త రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా, సిరీస్ను కైవసం చేసుకుంది. నామమాత్రంగా మిగిలిన చివరి రెండు మ్యాచ్లలో బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa