ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు సతీమణికి ఒక్కరోజే రూ. 80 కోట్లకుపైగా లాస్,,,భారీగా పడిపోయిన హెరిటేజ్ ఫుడ్స్‌ షేర్లు

business |  Suryaa Desk  | Published : Thu, Jan 29, 2026, 11:24 PM

భారత్- యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. గత 2 రోజులు దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు తీవ్ర ఒడుదొడుకుల్ని దాటుకొని రాణించగా.. ఇది రెండు రోజుల మురిపెమే అయిపోయింది. గురువారం సెషన్‌లో మళ్లీ భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో భారీ నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఇప్పుడు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. వార్త రాసే సమయంలో (మధ్యాహ్నం 12.30 గంటలకు) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టంతో 82,100 స్థాయిలో కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్లకుపైగా పతనంతో ప్రస్తుతం 25,250 మార్కుపైన కొనసాగుతోంది. పలు హెవీ వెయిట్ స్టాక్స్ పతనం అవుతున్నాయి.


మార్కెట్లు పతనం అవుతున్న నేపథ్యంలో దేశంలోని ప్రముఖ డెయిరీ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ షేరు భారీగా పతనం అవుతోంది. కిందటి రోజు రూ. 396.65 వద్ద ముగిసిన హెరిటేజ్ ఫుడ్స్ షేరు ఇవాళ నేరుగా 7 శాతానికిపైగా నష్టంత రూ. 368 వద్ద ఓపెన్ అయింది. అక్కడితో ఆగకుండా మళ్లీ ఇంట్రాడేలో 10 శాతం వరకు నష్టపోయి రూ. 358.20 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 9 శాతం నష్టంతో రూ. 360 స్థాయిలో ఉంది.


ఈ సంస్థ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 3.37 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 540 గా ఉండగా.. అక్కడి నుంచి చూస్తే దాదాపు 35 శాతం తగ్గింది. ఇక స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 352.10 గా ఉండగా.. దానికి ఇప్పుడు సమీపించిందని చెప్పొచ్చు. జనవరి 28న హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. ఇక్కడ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. సంస్థ నికర లాభం ఏకంగా 20 శాతం వరకు తగ్గి రూ. 34.5 కోట్లుగా వచ్చింది. ఆదాయం స్వల్పంగా 8.2 శాతం పెరిగి రూ. 1119.1 కోట్లుగా నమోదైంది. ఈ క్రమంలోనే లాభం తగ్గడంతో.. ఇన్వెస్టర్లు ఈ షేర్లను విక్రయిస్తుండటంతో అమ్మకాల ఒత్తిడి నెలకొన్నట్లు తెలుస్తోంది.


హెరిటేజ్ ఫుడ్స్ షేరు పతనంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. అయితే ఇక్కడ ఇన్వెస్టర్లే కాకుండా.. సంస్థ ప్రమోటర్లకు కూడా ఒక్కరోజులో భారీ నష్టాలు వచ్చాయని చెప్పొచ్చు. ఈ కంపెనీని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్థాపించినా ప్రస్తుతం ఆయనకు ఇందులో ఎలాంటి వాటా లేదు. పదవిలోనూ లేరు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి సంస్థకు వైస్ ఛైర్‌పర్సన్, ఎండీగా ఉండగా.. ఈమెకు ఇందులో 2025, డిసెంబర్ 31 నాటికి 24.37 శాతం వాటాకు సమానమైన 2,26,11,525 షేర్లు ఉన్నాయి. స్టాక్ ఇవాళ ఇంట్రాడేలో 10 శాతం వరకు పడిపోగా.. ఆమెకు ఒక్కరోజే ఏకంగా రూ. 86 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. మరో ప్రమోటర్, చంద్రబాబు- భువనేశ్వరి తనయుడు నారా లోకేష్ వాటా 10.82 శాతంగా ఉండగా.. మొత్తం షేర్లు 1,00,37,453 గా ఉండగా.. ఈయన సంపద రూ. 38 కోట్లకుపైగా సంపద తగ్గింది. లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణికి 4,30,952 షేర్లు ఉండగా.. ఈమెకు రూ. 4,30,952 నష్టం వచ్చింది. లోకేష్- బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్‌కు 56,075 షేర్లు ఉండగా.. రూ. 21 లక్షలకుపైగా నష్టం వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa