ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంపాదన రూ.15000 కన్నా తక్కువే,,,,డెలివరీ వర్కర్ల పరిస్థితిపై ఆర్థిక సర్వే ఆందోళన

business |  Suryaa Desk  | Published : Thu, Jan 29, 2026, 11:25 PM

దేశంలో గిగ్ ఎకానమీ గణనీయంగా అభివృద్ధి చెందినప్పటికీ గిగ్ వర్కర్ల పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నట్లు ఆర్థిక సర్వే 2026 పేర్కొంది. దేశంలో దాదాపు 40 శాతం మంది ఆన్‌లైన్ డెలివరీ వర్కర్లు నెలకు రూ.15 వేలు అంత కన్నా తక్కువే సంపాదిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవస్థలో గణనీయమైన, విధానపరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. గిగ్ వర్కర్లకు న్యాయమైన వేతనాలు అందించేందుకు వీలుగా వెయిటింగ్ పీరియడ్‌లో పరిహారంతో పాటుగంటకు లేదా ప్రతి పనికి కనీస ఆదాయం అందించాలని సూచించింది. నిబంధనల మార్పులే లక్ష్యంగా గిగ్ ఎకానమీ విధానం ఉండాలని స్పష్టం చేసింది.


దేశంలో గిగ్ ఎకానమీ వేగంగా విస్తరిస్తున్నట్లు ఆర్థిక సర్వే తెలిపింది. అయితే, ఆదాయంలో అస్థిరత ఓ కీలక సమస్యగా మారిందని, ఇది లోన్లు పొందడంలో అడ్డంకులను సృష్టిస్తోందని పేర్కొంది. ఈ కారణంగా గిగ్ వర్కర్లు ఆర్థికంగా వెనకబడి పోయారని, లోన్స్ పొందే అవకాశాలు తక్కువగా ఉండడం వారిలో ఆందోళనలు పెంచుతుందని అభిప్రాయపడింది. గిగ్ వర్కర్లలో 40 శాతం మంది నెలకు రూ. 15000 కన్నా తక్కువగానే సంపాదిస్తున్నారని ఆర్థిక సర్వే అంచనా వేసింది. అంతే కాదు పరిమితమైన నైపుణ్యాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ వంటి టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ఉద్యోగం కోల్పోయే ప్రమాదం అధికంగా ఉన్నట్లు తెలిపింది.


ప్రస్తుతం దేశంలో చాలా కంపెనీలు ఆన్‌లైన్ సర్వీసులు అందిస్తున్నాయి.ఫుడ్ డెలివరీలో జొమాటో, స్విగ్గీ వంటివి మార్కెట్ లీడర్లుగా కొనసాగుతున్నాయి. లక్షల మంది నిత్యం ఆన్‌లైన్ ఆర్డర్లు చేస్తున్నారు. వాటిని డెలివరీ చేసేందుకు లక్షల మంది గిగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. అయితే, ఆన్‌లైన్ డెలివరీ వర్కర్లకు సరైన వేతనాలు ఉండడం లేదు. తమకు సైతం అన్ని రకాల సామాజిక భద్రత ప్రయోజనాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసిన సంఘటనలూ ఉన్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ నోటిఫై చేసింది. అందులో గిగ్ వర్కర్లకు ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. అయినప్పటికీ వారికి ఇతర ఉద్యోగుల మాదిరిగా సమానంగా వేతనాలు, ప్రయోజనాలు ఉండే పరిస్థితులు లేవు. ఈ దిశగా పలువురు విశ్లేషకులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. గిగ్ వర్కర్లకు సరైన వేతనాలు ఉండేలా చట్టాలు రూపొందించాలని కోరారు. ఇప్పుడు ఆర్థిక సర్వే సైతం గిగ్ వర్కర్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa