ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ 'కాన్ఫిడెంట్ గ్రూప్' చైర్మన్ సీజే రాయ్ ఆకస్మిక మరణం బెంగళూరులో తీవ్ర కలకలం సృష్టించింది. ముఖ్యగా జనవరి 30వ తేదీన ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేస్తుండగా.. అదే సమయంలో ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే తాజాగా ఆయన అంత్యక్రియలు జరగ్గా.. అంతిమయాత్రలో కోట్ల విలువైన లగ్జరీ కార్లను వినియోగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. సీజే రాయ్కు కార్ల పట్ల ఉన్న విపరీతమైన ప్రేమపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
లక్ష రూపాయల కారు కోసం రూ.10 లక్షలు
కేరళకు చెందిన సీజే రాయ్ బెంగళూరులో తన ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1994లో తన 25వ ఏట.. ఆయన తొలిసారి రూ. 1.10 లక్షలు పెట్టి మారుతి 800 కారును కొనుగోలు చేశారు. వ్యాపారంలో ఎదిగిన తర్వాత ఆ కారును అమ్మేసినప్పటికీ.. తన తొలి వాహనంపై ఉన్న మమకారంతో 27 ఏళ్ల తర్వాత దానిని వెతికి పట్టుకున్నారు. ఆ కారును తిరిగి తెచ్చి ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతగా ఏకంగా రూ. 10 లక్షలు బహుమతిగా ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు.
సాధారణంగా అంతిమయాత్రలు ఎంతో నిరాడంబరంగా సాగుతాయి. కానీ రాయ్ విషయంలో ఆయనకు కార్ల పట్ల ఉన్న ఇష్టాన్ని గౌరవిస్తూ... ఆయన భౌతికకాయాన్ని రోల్స్ రాయిస్ వంటి అత్యంత ఖరీదైన కారులో తరలించారు. గతేడాది నవంబర్లోనే ఆయన సుమారు రూ. 12 కోట్ల ఖర్చు చేసిన 'రోల్స్ రాయిస్ ఫాంటమ్-8' కారును కొన్నారు. అంతకు ముందు జూలైలో ఆయన తన సోషల్ మీడియా వేదికగా తన వద్ద ఉన్న లంబోర్గిని, బుగాటి వెయరాన్ వంటి సూపర్ కార్లు ఉన్నాయంటూనే వాటి గురించి ప్రస్తావించి నెటిజన్లను ఆశ్చర్య పరిచారు.
ఐటీ దాడులు.. ప్రాణం తీసిన ఒత్తిడి?
అయితే జనవరి 30వ తేదీన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజే రాయ్ నివాసం, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆయన.. తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. బెంగళూరులో ఎన్నో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులను నిర్మించిన కాన్ఫిడెంట్ గ్రూప్ అధినేత ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం రియల్ ఎస్టేట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa