భారత్, అమెరికా వాణిజ్య సంబంధాల్లో సోమవారం ఒక చారిత్రాత్మక మలుపు చోటుచేసుకుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన కీలక చర్చల అనంతరం.. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ఒప్పందం కుదిరింది. ఈ భారీ ఊరట వల్ల 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులకు అగ్రరాజ్యంలో సరికొత్త మార్కెట్ అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ల కంటే భారత్కే ఎక్కువ లాభం చేకూరబోతోంది.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ గతేడాది భారత ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచారు. రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నందుకు విధించిన 25 శాతం అదనపు సుంకంతో కలిపి మొత్తం పన్ను 50 శాతానికి చేరింది. అయితే తాజా ఒప్పందం ప్రకారం.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయడానికి అంగీకరించింది. దీనికి బదులుగా రష్యా చమురుపై విధిస్తున్న 25 శాతం శిక్షాత్మక సుంకాన్ని అమెరికా రద్దు చేసింది. అలాగే మరో 25 శాతం ఉన్న రెసిప్రోకల్ టారిఫ్ను 18 శాతానికి తగ్గించింది.
పొరుగు దేశాల కంటే మెరుగ్గా..
ఈ ఒప్పందంతో ఆసియాలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ మెరుగైన స్థానానికి చేరుకుంది. ముఖ్యంగా చైనాపై 37 శాతం, బ్రెజిల్పై 50 శాతం, వియత్నాంపై 20 శాతం, బంగ్లాదేశ్పై 20 శాతం, పాకిస్థాన్పై 19 శాతం ఉండగా.. భారత్ కేవలం 18 శాతం సుంకాన్ని ఎదుర్కోనుంది. అయితే అమెరికా బ్రిటన్పై 10 శాతం, ఈయూ, జపాన్, దక్షిణ కొరియాలపై కేవలం 15 శాతం మాత్రమే సుంకాలు వసూలు చేస్తుండగా.. ఇవి భారత్కంటే కాస్త ఎక్కువ. అయినప్పటికీ.. అంతర్జాతీయ పోటీలో భారత్కు ఇది పెద్ద విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఒప్పందంలో భాగంగా భారత్.. రష్యాకు బదులుగా అమెరికా, వెనెజువెలా నుంచి చమురును కొనుగోలు చేయనుంది. దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఇంధనం (చమురు, బొగ్గు), టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని ట్రంప్ ప్రకటించారు. దీనికి ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలను కూడా సున్నాకి తగ్గించనున్నట్లు సమాచారం.
అమెరికాతో ట్రేడ్ డీల్పై ప్రధాని మోదీ హర్షం..
"నా ప్రియ మిత్రుడు ప్రధాని మోదీతో మాట్లాడటం గర్వంగా ఉంది. ఆయన కోరిక మేరకే ఈ సుంకాల తగ్గింపు నిర్ణయం తీసుకున్నాను" అని ట్రంప్ సోషల్ మీడియా వేదిక 'ట్రూత్'లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. "140 కోట్ల మంది భారతీయుల తరఫున ట్రంప్నకు ధన్యవాదాలు. రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రపంచ శాంతికి, సుస్థిరతకు ఎంతో మేలు జరుగుతుంది" అని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa