ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహానందిలో మహాశివరాత్రి వేడుకలు.. భక్తుల కోసం దేవస్థానం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 09:46 PM

ప్రముఖ శైవక్షేత్రం మహానంది మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. మహాశివరాత్రి సందర్బంగా మహానందిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బ్రహ్మోత్సవాల సమయంలో మహానంది ఆలయంలో స్పర్శ దర్శనం, అభిషేకాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు.


ఈ విషయాన్ని మహానంది దేవస్థానం ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజులలో స్పర్శ దర్శనం, ఆర్జిత సేవలు నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. అలాగే రుద్రగుండం పుష్కరిణిలోనూ భక్తులకు స్నానాలకు అనుమతి లేదని వెల్లడించారు.


  మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మహానంది దేవస్థానం ఈవో వివరించారు. బుధవారం రోజున మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వానపత్రిక, వాల్ పోస్టర్లను ఈవో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈవో శ్రీనివాస రెడ్డి.. ఫిబ్రవరి 11న కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామి.. నంద్యాలలోని బ్రహ్మనందీశ్వర స్వామి అమ్మవార్లను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు వెళ్తారని వివరించారు. మహానంది ఆలయానికి ఫిబ్రవరి12న తిరిగి చేరుకుంటారని.. ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.


ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఈవో వివరించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం సింహ వాహనంపైనా గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి జాగరణ ఉంటుందని ఈవో వెల్లడించారు. ఈ సందర్భంగా రాత్రి పది గంటల నుంచి లింగోద్భావకాలంలో మహా రుద్రాభిషేకం నిర్వహిస్తామన్నారు.


అదేవిధంగా తెల్లవారుజామున మూడు గంటలకు కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు మహానంది ఆలయం ఈవో వివరించారు. ఫిబ్రవరి16వ తేదీ ఉదయం నుంచి దీక్షా హోమాలు ఉంటాయని.. రాత్రి పుష్ప పల్లకీ సేవ నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 17న మధ్యాహ్నం మూడు గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి18న ధ్వజావరోహణం, శివ దీక్ష విరమణ, మహా పూర్ణాహుతి కార్యక్రమాలతో పాటుగా రాత్రికి తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు మహానంది దేవస్థానం అధికారులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa