ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీ దిగ్గజం ఉద్యోగులకు ఏకంగా 100 శాతం బోనస్

business |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 10:07 PM

మీరు ప్రముఖ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారా? అయితే మీకు వేరియబుల్ పే గురించి తెలిసే ఉంటుంది. దీనినే మరో భాషలో బోనస్ అని చెబుతుంటారు. ఎక్కువగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఐటీ కంపెనీలు ఇతర కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు ప్యాకేజీల్లో భాగంగానే వేరియబుల్ పేను అందిస్తుంటాయి. దీనిని నెలనెలా జీతంతో కాకుండా.. కొన్ని కంపెనీలు ప్రతి త్రైమాసికానికి.. ఇంకొన్ని 6 నెలలకు ఓసారి విడుదల చేస్తుంటాయి. మరికొన్ని కంపెనీలు ఆర్థిక సంవత్సరం చివర్లో వేరియబుల్ చెల్లింపుల్ని చేస్తుంటాయి. అయితే చాలా వరకు కార్పొరేట్ కంపెనీలు ఈ వేరియబుల్ పేను.. ఉద్యోగి పనితీరుతో ముడిపెడుతుంటాయి. పనితీరు బాగున్న దానిని బట్టి ఎక్కువ శాతం.. లేకపోతే తక్కువ బోనస్ ఆఫర్ చేస్తుంటాయి. సీనియర్ స్థాయి ఉద్యోగులకు మాత్రం కంపెనీ పనితీరుతో కూడా లింక్ అయి ఉంటుంది.


టీసీఎస్ వంటి కంపెనీ విషయానికి వస్తే ప్రతి త్రైమాసికంలోనూ దాదాపు 70 శాతం మందికి 100 శాతం వేరియబుల్ పే చెల్లించేది. ఇటీవల దీనిని ఉద్యోగుల ఆఫీస్ అటెండెన్స్‌తో ముడిపెడుతోంది. 85 శాతం కంటే ఎక్కువ హాజరు ఉన్న వారికే పూర్తి స్థాయిలో బోనస్ అందిస్తుండగా.. మిగతా వారికి తక్కువగా ఉంది. సీనియర్ ఉద్యోగులకు కంపెనీ బిజినెస్ యూనిట్ పెర్ఫామెన్స్‌తో లింక్ పెడుతోంది.


 ఈ క్రమంలోనే తాజాగా అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్.. 2025 సంవత్సరం చివరి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. అక్టోబర్- డిసెంబర్ సమయంలో లాభం ఏకంగా 18 శాతానికిపైగా పెరిగి రూ. 5,830 కోట్లుగా నమోదైంది. ఆదాయం 3 నెలల్లో 4.9 శాతం పెరిగి రూ. 48 వేల కోట్లకు చేరుకుంది. ఇక్కడ 2025 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కూడా అంచనాల్ని మించి రాణించింది. 2025 సంవత్సరంలో ఆదాయం మొత్తం 7 శాతం పెరిగి రూ. 1.90 లక్షల కోట్లకు చేరుకుంది.


దీంతో అంచనాల్ని మించి రాణించడంతో కాగ్నిజెంట్ కీలక ప్రకటన చేసింది. టాప్ టైర్ ఐటీ ఇండస్ట్రీ పెర్ఫామెన్స్‌కు కొలమానంగా నిర్దేశించుకునే విన్నర్స్ సర్కిల్‌లోకి ప్రవేశించినందుకుగానూ.. 2025 ఆర్థిక సంవత్సరానికి తమ ఉద్యోగులకు అందరికీ 100 శాతం వేరియబుల్ పే (బోనస్) చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ ఎస్. రవి కుమార్.. తమ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్‌లో ఈ వివరాల్ని వెల్లడించారు. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.50 లక్షలకుపైగా ఉండగా.. ఎక్కువ భాగం ఇండియాలోనే ఉన్నారు. కంపెనీ విన్నర్స్ సర్కిల్ కింద కొన్ని లక్ష్యాల్ని నిర్దేశించుకొని 2027 కల్లా చేరుకోవాలని అనుకోగా.. అంతకు రెండేళ్ల ముందుగానే 2025లోనే వాటిని సాధించడం విశేషం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వారి పనితీరు ఆధారంగా 85 శాతం నుంచి 115 శాతం వరకు బోనస్ అందించింది. ఇప్పటికే గతేడాది ఆగస్ట్ నుంచే ఉద్యోగులకు జీతాల పెంపు అమల్లోకి వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa