ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్‌ఏసీ ప్రయాణికులకు,,,,,బెర్త్ దొరక్కపోతే ఛార్జీలో రీఫండ్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 09:37 PM

భారతీయ రైల్వేలో ప్రయాణించే కోట్లాది మంది ప్యాసింజర్లకు, ముఖ్యంగా ఆర్‌ఏసీ (RAC) ఇబ్బందులు ఎదుర్కొనే వారికి పార్లమెంటరీ కమిటీ తీపి కబురు అందించింది. రైలు ప్రయాణంలో ఆర్‌ఏసీ టికెట్ ఉన్న వారి నుంచి పూర్తి స్థాయి ఛార్జీ వసూలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. బోర్డింగ్ సమయానికి పూర్తి బెర్త్ లభించని పక్షంలో.. సదరు ప్రయాణికులకు టికెట్ ధరలో కొంత మొత్తాన్ని వెనక్కి ఇచ్చేలా ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలని కీలక సూచనలు చేసింది.


ఒక్క బెర్త్.. ఇద్దరు ప్రయాణికులు.. రెండు ఛార్జీలు!


ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. ఆర్‌ఏసీ కేటగిరి కింద టికెట్ ఖరారైన వారు మరొక ప్రయాణికుడితో కలిసి ఒకే బెర్త్‌ను పంచుకోవాల్సి ఉంటుంది. అయితే రైల్వే శాఖ మాత్రం ఆ ఇద్దరు ప్రయాణికుల నుంచి విడివిడిగా పూర్తి స్థాయి ఛార్జీని వసూలు చేస్తోంది. దీనిపై పార్లమెంటరీ ప్రజాపద్దుల కమిటీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సౌకర్యం సగం మాత్రమే ఉన్నప్పుడు.. వసూళ్లు మాత్రం వంద శాతం ఉండటం సరికాదని అభిప్రాయపడింది. 'పంక్చువాలిటీ అండ్ ట్రావెల్ టైమ్ ఇన్ ట్రైన్ ఆపరేషన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్' పేరుతో పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ అంశాలను పొందుపరిచింది.


రీఫండ్ కోసం ప్రత్యేక వ్యవస్థ


ఆర్‌ఏసీలోనే ఉండిపోయి, ప్రయాణం ముగిసే వరకు పూర్తి బెర్త్ లభించని పక్షంలో.. ఆ ప్రయాణికుడు నష్టపోయిన సౌకర్యానికి ప్రతిఫలంగా కొంత డబ్బును వాపస్ ఇవ్వాలని కమిటీ సూచించింది. ఇందుకోసం సాంకేతికంగా ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని కూడా రైల్వే బోర్డును ఆదేశించింది. టికెట్ బుకింగ్ సమయంలోనే కాకుండా ప్రయాణం ముగిసిన తర్వాత కూడా ఈ రీఫండ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని తెలిపింది.


రైల్వే శాఖపై కమిటీ నిఘా


కేవలం సూచనలు చేయడమే కాకుండా.. ఈ విషయంలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏమిటో నివేదించాలని కూడా కమిటీ అధికారులను కోరింది. ప్రయాణికుల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయికి తగిన సేవలను అందించాల్సిన బాధ్యత రైల్వేపై ఉందని గుర్తు చేసింది. ఒకే సీటును ఇద్దరికి కేటాయించి, ఇద్దరి వద్ద పూర్తి డబ్బులు తీసుకోవడం ద్వారా వస్తున్న అదనపు ఆదాయంపై కమిటీ వివరణ కోరింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa