పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్పై దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే.. ఇరాన్లో ఉన్న అమెరికా పౌరులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని వైట్హౌస్ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే వచ్చేయడం వీలుకాకపోతే సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలంటూ చెప్పడంతో.. పశ్చిమాసియాలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.
ప్రభుత్వ సహాయం కోరకుండానే బయటపడండి!
వర్చువల్ అమెరికన్ ఎంబసీ జారీ చేసిన తాజా హెచ్చరిక ప్రకారం.. ఇరాన్లో ఉన్న అమెరికన్లు అందరూ తక్షణమే స్వదేశానికి వచ్చేయాలి. లేదంటే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి. విమానాలు రద్దు అయ్యే అవకాశం ఉన్నందున.. వాణిజ్య విమానాలు అందుబాటులో ఉండగానే ఇరాన్ వీడాలని సూచించింది. ఒకవేళ విమాన ప్రయాణం సాధ్యం కాకపోతే.. రోడ్డు మార్గం ద్వారా అర్మేనియా లేదా టర్కీ సరిహద్దుల వైపు వెళ్లాలని ఆదేశించింది. అత్యంత విస్తుపోయే విషయం ఏమిటంటే.. ఈ తరలింపు ప్రక్రియలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాన్ని ఆశించవద్దని, సొంతంగానే ప్లాన్ చేసుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ ప్రభుత్వం ఎప్పుడైనా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని చెప్పింది.
ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారికి పొంచి ఉన్న ముప్పు
అమెరికా-ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారి విషయంలో వాషింగ్టన్ మరింత ఆందోళన చెందుతోంది. ఇరాన్ ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వాన్ని గుర్తించదు కాబట్టి.. వారిని కేవలం ఇరాన్ పౌరులుగానే పరిగణించి అరెస్టు చేసే అవకాశం ఉందని యూఎస్ హెచ్చరించింది. అమెరికా పాస్పోర్ట్ చూపించడం లేదా అమెరికాతో సంబంధాలు కలిగి ఉండటమే వారి అరెస్టుకు ప్రధాన కారణం కావచ్చని కూడా స్పష్టం చేసింది. అరెస్టులు, విచారణలు పెరిగే ప్రమాదం ఉన్నందున తక్కువ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలని.. నిరసనలకు దూరంగా ఉండాలని సూచించింది.
సయోధ్య కోసం టర్కీ ప్రయత్నాలు
మరోవైపు ఈ ఉద్రిక్తతలు పూర్తి స్థాయి యుద్ధానికి దారితీయకుండా టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధాల విషయంలో మాత్రమే చర్చలు జరుపుతామని మొండికేస్తుండగా.. క్షిపణి వ్యవస్థపై కూడా చర్చలు జరగాలని అమెరికా పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల అగ్రనేతల మధ్య చర్చలు జరగడం ఒక్కటే మార్గమని టర్కీ భావిస్తోంది. ఏది ఏమైనా ట్రంప్ తన హెచ్చరికలను కార్యరూపంలోకి తెస్తే పశ్చిమాసియాలో పెను విపత్తు తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa