యువ భారత్ మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ పోరులో ఇంగ్లండ్ను 100 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించి, టీమ్ ఇండియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. మైదానంలో ఆటగాళ్లు చూపిన అసాధారణ పోరాటపటిమ, క్రమశిక్షణ భారత్కు ఈ చారిత్రాత్మక విజయాన్ని అందించాయి. ఈ గెలుపుతో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోగా, సోషల్ మీడియా వేదికగా కుర్రాళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
అయితే, ఇంతటి భారీ విజయం సాధించినా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నుండి టీమ్ ఇండియాకు ఎలాంటి నగదు బహుమతి అందకపోవడం గమనార్హం. సాధారణంగా పెద్దల ప్రపంచకప్లో విజేతలకు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఉంటుంది, కానీ అండర్-19 టోర్నీలో మాత్రం ఐసీసీ ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. ఈ విషయం తెలుసుకున్న సగటు క్రికెట్ అభిమాని ఒక్కసారిగా షాక్కు గురవుతున్నాడు. ఆరోసారి టైటిల్ గెలిచినా ఖాళీ చేతులతోనే ఉండాలా అనే చర్చ మొదలైంది.
ఈ నిబంధన వెనుక ఐసీసీకి ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది. అండర్-19 టోర్నీని కేవలం యువ ఆటగాళ్లలోని ప్రతిభను వెలికితీసేందుకు, వారిని ప్రోత్సహించేందుకు మాత్రమే ఒక వేదికగా ఐసీసీ పరిగణిస్తుంది. చిన్న వయసులోనే కమర్షియల్ అంశాలకు, భారీ నగదు బహుమతులకు యువత అలవాటు పడకూడదనే ఉద్దేశంతో ఈ టోర్నీకి ప్రైజ్ మనీని కేటాయించదు. ఇక్కడ ముఖ్యం కేవలం క్రీడా స్ఫూర్తి మరియు దేశం కోసం ఆడే గౌరవం మాత్రమేనని ఐసీసీ భావిస్తోంది.
ఐసీసీ నగదు ఇవ్వకపోయినా, మన కుర్రాళ్ల అద్భుత ప్రదర్శనను గుర్తించడంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన టీమ్ ఇండియా సభ్యులకు మరియు సహాయక సిబ్బందికి కలిపి బీసీసీఐ రూ. 7.5 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. ఆటగాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని, వారి భవిష్యత్తుకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa