ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేవలం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే రాజీనామా చేశా.. బొలిశెట్టి క్లారిటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 06:54 PM

జనసేన పార్టీకి రాజీనామా అంటూ జరుగుతున్న ప్రచారంపై బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. తాను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే రాజీనామా చేశానని.. పార్టీకి కాదంటూ బొలిశెట్టి సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. జనసైనికుడిగా ఉద్యమం చేస్తున్నానని.. తాను వేసిన కేసు విచారణ పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని ప్రకటించారు. మరోవైపు జనసేనకు షాక్.. కీలక నేత రాజీనామా అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బొలిశెట్టి సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. పర్యావరణానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను కేసు వేశానని.. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనలో కీలక పదవిలో ఉండటం సముచితం కాదని పార్టీ పదవి నుంచి తప్పుకున్నట్లు బొలిశెట్టి వివరించారు.


"పర్యావరణంపై కేసు వేశాను. అది కోర్డు పరిధిలో ఉంది. నేను కేసు వేసినప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వేరే వాళ్లు పర్యావరణ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉంది. ఓ వైపు నేను జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సమయంలోనే.. మరోవైపు కూటమి ప్రభుత్వం మీద కేసు కొనసాగుతుంది. పార్టీలు మారినా ప్రభుత్వాలు కొనసాగుతాయి కావున ఆ కేసు అలాగే కొనసాగుతుంది.


"ఈ నేపథ్యంలో నేను జనసేన పార్టీ పర్యావరణ ప్రధాన కార్యదర్శిగా ఉండటం సరికాదని.. ఆ పదవికి రాజీనామా చేశా. జనసైనికుడిగా కొనసాగుతున్నా. పార్టీకి రాజీనామా చేయలేదు.. పదవికి మాత్రమే రాజీనామా చేశా. నేను రాసిన లెటర్‌లో కూడా ఈ విషయం ఉంది. ఈ కేసు పూర్తైన తర్వాత జనసేన పార్టీలో పవన్ కళ్యా్ణ్ ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తా్నని అందులో ఉంది. కానీ ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేస్తున్నారు. అందుకే క్లారిటీ ఇస్తున్నా.." బొలిశెట్టి సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు.


మరోవైపు ఇదే విషయంపై బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్ కూడా చేశారు. జనసేనాని వెంటే జనసైన్యం ఉంటుందన్న బొలిశెట్టి.. రాజకీయ యవనికపై జనసేన కేవలం పార్టీ కాదని.. సామాజిక విప్లవంగా అభివర్ణించారు. జనసేన పార్టీ ఎన్నికల కోసం పుట్టింది కాదని.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. మన సనాతన ధర్మం గొప్పతనాన్ని జతపరచి రూపొందించిన ఏడు మూల సిద్ధాంతాలపై ఆధారంగా నిర్మించిన వ్యవస్థగా పేర్కొన్నారు.


ఏ పార్టీలో అయినా కార్యకర్తలకు పార్టీ నుంచి ఆర్థిక సాయం వస్తుందని.. జనసైనికులు మాత్రం తమ సొంత డబ్బుతో జనసేన జెండాను మోస్తున్నారని అన్నారు. జనసేనతో తన బంధం రాజకీయాలకు అతీతమైనదని.. ఒక సిద్ధాంతం కోసం తాను కేవలం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే రాజీనామా చేశానని బొలిశెట్టి ట్వీట్ చేశారు. అయితే దానిని కొందరు స్వార్ధంతో తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa