ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్ ప్రసంగం అవాస్తవాలు కల్పితాలతో నిండిన డొల్ల పత్రం అని షర్మిల విమర్శ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 07:17 PM

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగం పూర్తిగా డొల్లగా అవాస్తవాలు కల్పితాలతో నిండి ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికల మ్యానిఫెస్టోకు కొన్ని మెరుగులు దిద్ది చదివినట్లుగా ఉందని రాష్ట్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఎలాంటి దశ దిశ లేదని ఆమె ఎద్దేవా చేశారు. 19 నెలల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే గవర్నర్‌తో పచ్చి అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి పాలనపై విజన్ గానీ విజ్ఞత గానీ లేవని సుపరిపాలన సమతూకం మచ్చుకైనా కనిపించడం లేదని దుయ్యబట్టారు.సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని షర్మిల విమర్శించారు. రూ. 33 వేల కోట్లతో వాటిని అమలు చేస్తున్నామని చెప్పడం పూర్తిగా బూటకమని అన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు ఇస్తామన్న నిరుద్యోగ భృతి హామీ అడ్రస్ లేకుండా పోయిందని తల్లికి వందనం కింద 20 లక్షల మంది విద్యార్థులను అన్నదాత సుఖీభవ కింద 40 లక్షల మంది రైతులను మోసం చేశారని ఆరోపించారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారని గోడ క్యాలెండర్లు మారుతున్నా జాబ్ క్యాలెండర్ మాత్రం రావడం లేదని విమర్శించారు. కోటి మంది మహిళలకు నెలకు రూ. 1500 ఇచ్చే ఆడబిడ్డ పథకానికి దిక్కులేదని కానీ 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి దానిలో జీవం తీశారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని యూనివర్సల్ హెల్త్ పాలసీ పేరుతో చంపేశారని1.43 కోట్ల కుటుంబాలకు వైద్యాన్ని అందని ద్రాక్ష చేశారని మండిపడ్డారు. రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అనేవి అభూత కల్పనలని కొట్టిపారేశారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత అంటూ డ్రామాలు ఆడుతున్నారే తప్ప చేతల్లో అది కనిపించడం లేదని అన్నారు. కిలో రూపాయికి టమాటోఉల్లి అమ్ముకుంటున్న రైతులను పట్టించుకోకుండా, మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ఆదుకున్నామని చెప్పడం దారుణమని ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ వైఖరిపైనా షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఒక్కరోజు మురిపెం కోసం కాదని, మైకు ఇస్తేనే మాట్లాడతా అని మారం చేయడానికి అసెంబ్లీకి పంపలేదని అన్నారు. జగన్ తన సొంత అజెండాను పక్కనపెట్టి, ప్రజా అజెండాతో సభకు వెళ్లి అధికార పక్షాన్ని నిలదీయాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై హామీలపై సభావేదికగా పోరాడాలని సూచించారు. శాసనసభకు వెళ్లే దమ్ము, ధైర్యం లేకుంటే జగన్ తన ఎమ్మెల్యేలతో సహా రాజీనామా చేయాలని షర్మిల సవాల్ విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa