ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుస్తకాలు తగలబెట్టి, కిడ్నాప్ డ్రామా ఆడిన యువతి

national |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 08:33 PM

సాధారణంగా విద్యార్థులు హోంవర్క్ చేయకపోతేనో, అనారోగ్యం వంకతోనో, బడికి వెళ్లడం ఇష్టం లేకనో రకరకాల నాటకాలు ఆడుతూ ఢుమ్మా కొడతుంటారు. కానీ తనకు నచ్చని కాలేజీలో చేర్పించారనే కోపంతో కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఒక విద్యార్థిని ఏకంగా తనను తానే కిడ్నాప్ చేసుకున్నట్లు భారీ నాటకానికి తెరలేపింది. మంగళూరు సమీపంలోని బెల్తంగడిలో వెలుగుచూసిన ఈ వింత ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా.. పోలీసులను సైతం కొద్దిసేపు పరుగులు పెట్టించింది.


ఏమిటా కిడ్నాప్ కథ?


సోమవారం ఉదయం బెల్తంగడిలో ఒక మైనర్ విద్యార్థిని తీవ్ర ఆందోళనతో పోలీసులను ఆశ్రయించింది. తాను స్కూటర్‌పై కాలేజీకి వెళ్తుండగా.. ముఖానికి ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి తనను అడ్డుకున్నారని ఫిర్యాదు చేసింది. వారు తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని.. ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేసి తన బ్యాగును ఎత్తుకెళ్లారని కన్నీరుమున్నీరైంది. ఆమె ఒంటిపై గాయాలు చూసిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి.. ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. పోలీసుల అలర్ట్!


పట్టపగలు ఒక విద్యార్థినిపై కిడ్నాప్ ప్రయత్నం జరగడంతో స్థానికంగా భయాందోళనలు రేకెత్తాయి. ముఖ్యంగా విషయం స్థానిక ఎమ్మెల్యే వరకూ వెళ్లగా.. ఆయన కూడా ఆస్పత్రికి వెళ్లారు. చిన్నారిని పరామర్శించారు. అలాగే కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులను త్వరగా పట్టుకోవాలంటూ పోలీసు అధికారులకు సూచించారు. దీంతో పోలీసులు కూడా విచారణను వేగవంతం చేశారు. అమ్మాయి చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. కానీ ఎక్కడా ఆమె చెప్పిన కారు గానీ, అనుమానిత వ్యక్తులు గానీ కనిపించలేదు.


ఒక్కొక్కటిగా వీడిన మిస్టరీ పొరలు


మరోవైపు పోలీసుల విచారణలో అమ్మాయి చెప్పే మాటల్లో పొంతన లేకపోవడంతో సందేహం మొదలైంది. నిందితులు ఏ దిశగా వెళ్లారు? కారు రంగు ఏమిటి? వంటి ప్రశ్నలకు ఆమె తడబడడం, పూటకో మార్చమారడం, దీనికి తోడు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆమె ఒంటిపై ఉన్న గాయాలు ఇతర వ్యక్తులు చేసినవి కావని, తనకు తానుగా చేసుకున్నవే అని నిర్ధారించడంతో పోలీసులు అనుమానం మరింత బలపడింది. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో బాలికను విచారించగా.. అసలు విషయం తెలిపింది.


తనను ఎవరూ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించలేరని.. తనకు తానుగానే ఈ నాటకం ఆడినట్లు వివరించింది. అయితే ఇలా చేయడం వెనుక ఓ కారణం కూడా ఉందని పేర్కొంది. తనకు బెల్తంగడిలోని గ్రామీణ కాలేజీలో చదవడం అస్సలు ఇష్టం లేదని, మంగళూరు నగరంలోని కాలేజీలో చేరాలని ఉందని వెల్లడించింది. తన పంతం నెగ్గించుకోవడానికి.. ఇంట్లో వాళ్లను నమ్మించడానికి తానే స్వయంగా గాయాలు చేసుకుని, తన పుస్తకాలను తానే తగలబెట్టి కిడ్నాప్ కథను అల్లినట్లు అంగీకరించింది. ఇదంతా విన్న పోలీసులు నోరెళ్లబెట్టారు.


మరోవైపు దక్షిణ కన్నడ ఎస్పీ డాక్టర్ అరుణ్ కె. ఈ కేసు గురించి మాట్లాడుతూ.. "ఆమె చెప్పిన కథను బలపరచడానికి ఒక ప్రత్యక్ష సాక్షిని కూడా రంగంలోకి దించింది. కానీ విచారణలో ఆ సాక్షి కూడా ఆమె చెప్పిన కథనే తాను రిపీట్ చేశానని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఆ విద్యార్థినికి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం" అని తెలిపారు. మొత్తానికి ఈ 'కిడ్నాప్ డ్రామా' సుఖాంతం కావడంతో అటు పోలీసులు, ఇటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa