టీ20 వరల్డ్ కప్లో భాగంగా రేపు నమీబియాతో జరగబోయే కీలక పోరుకు ముందు టీమ్ ఇండియాలో స్వల్ప కలకలం రేగింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ గత కొన్ని రోజులుగా కడుపు సంబంధిత సమస్యతో బాధపడుతుండటంతో, అతను ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతాడా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. ఈ టోర్నీలో మంచి ఫామ్లో ఉన్న అభిషేక్ దూరం కావడం జట్టు కాంబినేషన్పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అభిషేక్ శర్మ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా టీమ్ సభ్యుడు తిలక్ వర్మ కీలక అప్డేట్ ఇచ్చారు. అభిషేక్ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఈరోజు అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తిలక్ మీడియాకు వెల్లడించారు. అయితే, రేపు మ్యాచ్ సమయానికి అతను పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధిస్తేనే తుది జట్టులోకి తీసుకుంటామని, ఒకవేళ నీరసంగా ఉంటే మాత్రం విశ్రాంతినివ్వడం ఖాయమని మేనేజ్మెంట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఒకవేళ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోతే, అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంజూను ఓపెనర్గా పంపిస్తారా లేక మిడిల్ ఆర్డర్లో పంపి వేరే ఆటగాడితో ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా అనేది చూడాలి. సంజూకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అతను ప్లేయింగ్ 11లోకి వస్తే జట్టు బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికి అభిషేక్ శర్మ కోలుకోవాలని కోరుకుంటూనే, మరోవైపు ప్రత్యామ్నాయ వ్యూహాలపై కెప్టెన్, కోచ్ కసరత్తులు చేస్తున్నారు. నమీబియా చిన్న జట్టు అయినప్పటికీ, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవు కాబట్టి పూర్తి ఫిట్నెస్ ఉన్న ఆటగాళ్లనే బరిలోకి దించాలని టీమ్ ఇండియా భావిస్తోంది. రేపు టాస్ వేసే సమయానికి అభిషేక్ ఆరోగ్యంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది, అప్పటి వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa