ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వంపై చైనా సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 08:45 PM

సుదీర్ఘ కాలంగా సరిహద్దు వివాదాలతో అట్టుడుకుతున్న భారత్-చైనా సంబంధాల్లో సానుకూల మార్పు కనిపిస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందాలన్న భారత్ ఆకాంక్షలను తాము అర్థం చేసుకుంటామని, అలాగే గౌరవిస్తామని చైనా అధికారికంగా ప్రకటించింది. భారత్ పర్యటనకు వచ్చిన చైనా కార్యనిర్వాహక ఉప విదేశాంగ మంత్రి మా జావోక్సు, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.


శాశ్వత సభ్యత్వంపై మారిన స్వరం..


సాధారణంగా ఐరాస భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వాన్ని చైనా ఎప్పుడూ బహిరంగంగా సమర్థించలేదు. ఇతర అగ్రరాజ్యాలు భారత్‌కు నేరుగా మద్దతు ఇచ్చినప్పటికీ.. చైనా మాత్రం భారత్ ఐరాసలో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం అంటూ దాటవేసే ధోరణిని అవలంబించేది. అయితే తాజా భేటీలో భారత్ ఆకాంక్షలను గౌరవిస్తాం అని చైనా పేర్కొనడం గమనార్హం. ఇటీవల సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ తర్వాత చైనా నుంచి వచ్చిన మొదటి ప్రధాన సానుకూల సంకేతం ఇదే కాగా అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇది భారత్‌కు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడమేనా? లేక దౌత్యపరమైన మౌనమా? అనే కూడా నిపుణులు ఆలోచిస్తున్నారు.


సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత నెలకొంటేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడతాయని విక్రమ్ మిస్రీ ఈ భేటీలో స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను రాజకీయ, వ్యూహాత్మక కోణంలో పరిష్కరించుకోవాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వాణిజ్య రంగంలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించి, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. ఇటీవల ప్రారంభమైన కైలాష్ మానస సరోవర్ యాత్ర గురించి మిస్రీ ప్రస్తావిస్తూ.. యాత్రను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.


ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగిన బ్రిక్స్ షెర్పా సమావేశాల్లో భాగంగా.. ఇరు నేతలూ భేటీ అయ్యారు. ఈక్రమంలోనే కేవలం రాజకీయ అంశాలే కాకుండా.. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇరు దేశాలు మొగ్గు చూపాయి. వీసా నిబంధనలను సరళతరం చేయడం ద్వారా పర్యాటకం, విద్యా రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. గాల్వన్ ఘర్షణల తర్వాత దాదాపు నిలిచిపోయిన చర్చల ప్రక్రియ, ఈ సమావేశంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa