ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్‌ను జీహాదీలు పాలిస్తున్నారు... తస్లీమా నస్రీన్

international |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 09:42 PM

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల వేళ.. మహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్‌లో జీహాదిస్ట్‌లు అధికారంలో ఉన్నారని దుయ్యబట్టారు. యూనస్ నాయకత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఇస్లామిక్ ఛాందసవాదులకు అధికారం ఇస్తోందని, విస్తృత హింసకు నాయకత్వం వహిస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముసుగులో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోందని తస్లీమా నస్రీన్ దుమ్మెత్తతిపోశారు. బంగ్లాదేశ్‌లో ఇంకేం మిగిలి ఉందో తనకు తెలియదని ఈ మేరకు ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు.


‘‘జీహీదిస్ట్‌లు అధికారంలో ఉన్నారు.. ఇస్లామిక్ ఛాందసవాదులు అధికారంలోకి వస్తారు.. ప్రతి రోజూ మైనార్టీలపైన, ప్రతిపక్ష పార్టీ నాయకులపైన, ప్రశ్నించే గొంతుకలపైన హింసాత్మక దాడులు బంగ్లాదేశ్‌లో సర్వసాధారణమైపోయాయి’’ అని అన్నారు. యూనస్ నాయకత్వంలో భయం, అన్యాయం ఆక్రమించాయని ఆమె ఆరోపించారు. ఎలాంటి నేరం చేయకుండానే జర్నలిస్ట్‌లను, ప్రతిపక్ష నాయకులను జైల్లో పెడుతున్నారు కానీ, జీహాదిస్ట్‌లు, ఛాందసవాదులను స్వేచ్ఛగా వీధుల్లో తిరుగుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇక, గత మూడు దశాబ్దాలుగా బహిష్కరణ ఎదుర్కొంటున్న తస్లీమా నస్రీన్ ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.


బంగ్లాదేశ్ సాంస్కృతిక, చారిత్రక చిహ్నాలను ఒక క్రమపద్ధతిలో నాశనం చేస్తున్నారని నస్రిన్ ఆరోపించారు. ‘‘స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను ధ్వంసం చేశారు.. మీడియా హౌస్‌లను కూల్చివేశారు.. సాంస్కృతిక సంస్థలు కాలి బూడిదయ్యాయి. నేరస్థులపై ఎలాంటి చర్య తీసుకోలేదు, ఎందుకంటే వారు జీహాదీస్ట్ పాలనకు మద్దతు ఇస్తున్నారు’’ అని నస్రీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిర్భయంగా జరుపుతున్నామని యూనస్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అవామీ లీగ్ పార్టీ లేకుండా ఈ ఎన్నికలు చట్టబద్దం కావని, ఒక ప్రధాన రాజకీయ శక్తిని మినహాయించడం చట్టబద్ధతను తొలగిస్తుందని ఆమె వాదించారు. ‘యూనస్ అధికారంలో కొనసాగాలని భావిస్తున్నందున ఈ ఎన్నికలను కూడా ఆయన డమ్మీ చేయగలని దుయ్యబట్టారు.


ఒక, ఇస్లామిక్ శక్తులు ఏకీకృతమైతే బంగ్లాదేశ్‌ను ఎవరూ రక్షించలేరని అన్నారు. ‘‘ప్రజాస్వామ్యం ముసుగులో ఇస్లామిక్ పాలనకు ప్రయత్నిస్తున్నారు.. జమాతే ఇస్లామ్ అధికారంలోకి వస్తే.. షరియా లాను అమలుచేస్తారు.. అదే జరిగితే మహిళలు, మైనార్టీలకు ఎలాంటి హక్కులు ఉండవు.. అంతా విధ్వంసమే.. బీఎన్పీ, జమాతే సిద్ధాంతపరంగా భిన్నమైనవి కావు.. అధికారం కోసం ఆ రెండూ ఇస్లామ్‌ను వాడుకుంటాయి.. షేక్ హీసీనా కూడా అదే చేశారు’’ అని వ్యాఖ్యానించారు. మదర్సాలను విస్తరించడం ద్వారా, మతపరమైన డిగ్రీలను విశ్వవిద్యాలయ అర్హతలతో సమానం చేయడం వంటి చర్యలతో షేక్ హసీనా లౌకిక విద్యను బలహీనపరిచారని ఆరోపించారు. బంగ్లాదేశ్ పార్లమెంట్‌ ఎన్నికలు గురువారం జరగనున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa