భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహానికి దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలను స్వయంగా కలిసి ఆహ్వానించారు. అర్జున్ టెండూల్కర్ – సానియా చాండక్ వివాహ వేడుకలు త్వరలో జరగనున్న నేపథ్యంలో, సచిన్ కుటుంబ సభ్యులతో కలిసి పలువురు ప్రముఖులను కలిశారు.
న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సచిన్ తన కుటుంబంతో కలిసి కలిసి, వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్న సచిన్, “రాహుల్ గాంధీజీని కలిసి అర్జున్–సానియా పెళ్లికి ఆహ్వానించాం” అని పేర్కొన్నారు.
అంతకుముందు రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కూడా సచిన్ కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ప్రధాని మోదీని కలిసిన అనంతరం, ఆయన ఇచ్చిన ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సచిన్ ప్రత్యేకంగా పోస్ట్ చేశారు.
రాష్ట్రపతి ముర్మును రాష్టపతి భవన్లో కలిసిన సచిన్, గతంలో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. అర్జున్–సానియా పెళ్లికి దేశ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉండటంతో ఈ వేడుక హై ప్రొఫైల్గా మారనుంది.
గత ఏడాది ఆగస్టులో అర్జున్, సానియా నిశ్చితార్థం జరిగింది. సానియా చాండక్ ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు కాగా, టెండూల్కర్ కుటుంబంతో చాలా కాలంగా సన్నిహిత సంబంధం కలిగి ఉంది. ముఖ్యంగా సారా టెండూల్కర్తో ఆమెకు స్నేహం ఉంది. 26 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు ఐపీఎల్లో ఐదు మ్యాచ్లు ఆడి మూడు వికెట్లు తీసి 13 పరుగులు చేశాడు. 2021లో ముంబయి జట్టుతో దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టిన అర్జున్, ప్రస్తుతం గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్కు ముందు ముంబయి ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్కు అర్జున్ ట్రేడ్ అయ్యాడు. ఈ సీజన్లో ఎల్ఎస్జీ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ కెరీర్లో అర్జున్కు ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. 2021లో తొలిసారి ముంబయి జట్టులో చోటు దక్కినా అవకాశం రాలేదు. 2023లో అరంగేట్రం చేసిన అతడు మంచి ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం తన కెరీర్ను నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa