ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ సహా పలు దేశాల్లో ఎక్స్ సేవలకు అంతరాయం

national |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 09:31 PM

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని 'ఎక్స్' సేవలు సోమవారం సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. భారత్‌తో పాటు అమెరికా, యూకే వంటి అనేక దేశాల్లో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ అకౌంట్లలోకి లాగిన్ అవ్వలేకపోవడం, కొత్త పోస్టులు లోడ్ కాకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. కొద్ది గంటల పాటు కొనసాగిన ఈ అంతరాయంతో ఎక్స్ వేదికపై కార్యకలాపాలు స్తంభించిపోయాయి.టెక్నికల్ సమస్యలను గుర్తించే వెబ్‌సైట్ 'డౌన్ డిటెక్టర్' ప్రకారం, ఈ అంతరాయంపై ఫిర్యాదుల సంఖ్య అనూహ్యంగా 25,000 దాటింది. వీరిలో 53 శాతం మంది ఎక్స్ యాప్ యూజర్లు లాగిన్ సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదించారు. అదే సమయంలో 16 శాతం మంది వెబ్‌సైట్ యూజర్లు కూడా ఇబ్బందులు పడినట్లు డౌన్ డిటెక్టర్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఈ సాంకేతిక సమస్యకు కచ్చితమైన కారణం ఏంటనేది వెంటనే తెలియరాలేదు. దీనిపై వివరణ కోరగా ఎక్స్ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.ఎక్స్ సేవలు నిలిచిపోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది నవంబర్‌లో కూడా భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లు ఇలాంటి అంతరాయాన్నే ఎదుర్కొన్నారు. అప్పుడు 'క్లౌడ్‌ఫ్లేర్' ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో తలెత్తిన సమస్య కారణంగా ఎక్స్‌తో పాటు పలు ఇతర వెబ్‌సైట్లు కూడా డౌన్ అయ్యాయి. ఆ సమస్యను తర్వాత క్లౌడ్‌ఫ్లేర్ పరిష్కరించింది. ఆసక్తికరంగా, ఆ సమయంలో డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ కూడా క్లౌడ్‌ఫ్లేర్‌పై ఆధారపడటంతో అది కూడా లోడ్ అవ్వడానికి ఇబ్బంది పడింది.అంతకుముందు, గతేడాది మే నెలలో సైతం ఎక్స్ గ్లోబల్‌గా మొరాయించింది. అప్పుడు కూడా యూజర్లు కొత్త పోస్టులు చూడలేక, లాగిన్ అవ్వలేక ఇబ్బంది పడ్డారు. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు సేవలు నిలిచిపోయాయి. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 5,000 మందికి పైగా యూజర్లు సమస్యలను ఎదుర్కొన్నట్లు డౌన్ డిటెక్టర్ తెలిపింది. తరచూ ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తడం యూజర్లలో ఆందోళన కలిగిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa