ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో నవ్యాంధ్రకు కొత్త దశ-దిశ లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సాధికారత, సంపద సృష్టి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. బిల్ గేట్స్ రాకను చారిత్రాత్మకమని అభివర్ణించిన సీఎం, ఈ భాగస్వామ్యం రాష్ట్ర ప్రజల సాధికారతకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. 1997లో తొలిసారి బిల్ గేట్స్ను కలిసి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కేంద్రం ఏర్పాటు ఆవశ్యకతను వివరించిన నాటి నుంచి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలుపుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మాట్లాడిన బిల్ గేట్స్, భారత డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. తాను తొలిసారి చంద్రబాబును కలిసినప్పుడే ఆయన ఆలోచనల్లోని ముందుచూపును గ్రహించానని వెల్లడించారు. ఆ రోజుల్లో ఈ విషయంలో నాటి సింగపూర్ ప్రధాని మాత్రమే చంద్రబాబుకు కొంత సమీపంలో ఉండేవారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో ఏఐని ఈ స్థాయిలో వినియోగించడం లేదని, కానీ ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ముందుండటం గొప్ప పరిణామమని అభినందించారు. విపత్తుల నిర్వహణలో టెక్నాలజీతో ప్రాణనష్టం నివారించే వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించారు. చంద్రబాబు తనకు "గుడ్ ఓల్డ్ ఫ్రెండ్" అని బిల్ గేట్స్ సరదాగా వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa