ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 22ఏ భూముల సమస్య.... 15 రోజులు డెడ్‌లైన్,,ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 08:10 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22ఏ భూముల అంశాన్ని కొలిక్కి తెచ్చే పనిలో ఉంది.. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. ఆటో ఐడెంటిఫికేషన్ ద్వారా సీసీఎల్‌ఏ స్థాయిలో గుర్తించి.. ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపి చర్యలు తీసుకునేలా ఓ విధానాన్ని అమలు చేయనుంది. ఈనాం భూములు సహా 22ఏ కింద భూముల సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ యంత్రాంగ సాయంతో నెల పాటూ ఫోకస్ పెట్టనుంది. త్వరలోనే విధివిధానాలను కూడా విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని భూముల్ని భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సమస్యల్ని పరిష్కరించేందుకు కసరత్తు చేస్తోంది.


ఏపీ ప్రభుత్వం జనవరి 1న.. 22ఏ జాబితాలో కింద ఉన్న వాటిలో ఐదు రకాల భూముల్ని తొలగించేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐదు రకాల భూముల్లో.. స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనిక ఉద్యోగులు, ప్రస్తుత సైనిక ఉద్యోగులు, రాజకీయ బాధితులు.. ఇలా ఆ భూములకు విముక్తి కల్పించనున్నారు. అంతేకాదు జిల్లా కలెక్టర్ల నుంచి తాజా 22ఏ జాబితాలు వచ్చాక సాఫ్ట్‌వేర్‌లో తగిన విధంగా మార్పులు చేయనున్నారు. ఈనాం భూముల్ని 22ఏ జాబితాలో చేర్చారు.. వీటికి పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నా, పంట రుణాలు తీసుకుంటున్నా వదల్లేదు. వీటిని వెబ్‌ల్యాండ్ 1.O ఆధారంగా నమోదు చేయలేదు.. అందుకే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఎంతోమంది రైతులు ఇబ్బందిపడుతున్నారు. 22ఏ జాబితాలో గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చిన భూములు కూడా ఉన్నాయి.. వీటికి బ్యాంకు రుణాలు కూడా అందడం లేదు. రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ భూముల సమస్యలు కూడా పరిష్కారం కాలేదు.. ఈ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపేయడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు.


చాలామంది ప్రజలు 22ఏ భూముల జాబితా నుంచి తమ భూముల్ని తొలగించాలని దరఖాస్తులు ఇస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఈ భూముల్ని 22ఏ జాబితా నుంచి తొలగిస్తే ఇబ్బందులు వస్తాయేమోనని భయపడుతున్నారట. ఈ సమస్యల పరిష్కరానికి మార్గదర్శకాలు జారీ చేస్తున్నా సరే అమలు జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. అందుకే అర్హత ఉన్నవాటిని ఆటో ఐడెంటిఫికేషన్‌ విధానం 22ఏ జాబితా నుంచి తొలగించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ 22ఏ జాబితాలో పట్టా, ఈనామ్‌ భూమిని పొరపాటున ఉంటే ఆటో ఐడెంటిఫికేషన్‌ ద్వారా సిస్టమ్‌ గుర్తిస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత కలెక్టర్ లాగిన్‌కు వెళుతుంది.. 15 రోజుల్లోగా వీటిని 22ఏ జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది.


ఒకవేళ ఆ భూముల్ని 22ఏలోనే ఉంచాలనుకుంటే కచ్చితంగా కారణాన్ని తెలియజేయాల్సి ( సంబంధిత పత్రాలు అప్‌లోడ్‌ చేయాలి) ఉంటుంది. లేని పక్షంలో ఆ భూముల్ని 22ఏ జాబితా నుంచి తొలగిస్తారు. ఒకసారి జాబితా నుంచి తొలగిస్తే.. మళ్లీ చేర్చడానికి వీలు కూడా ఉండదు.. సీసీఎల్‌ఏకు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మారుస్తారు. ఆ భూముల్ని కలెక్టర్ 22ఏ నుంచి తొలగించగానే.. వెబ్‌ల్యాండ్‌ 2.0, రిజిస్ట్రేషన్‌ శాఖల్లో వెంటనే అప్డేట్ అవుతుంది. దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించి ఆశాఖ అధికారులు భూమి రికార్డుల్ని పరిశీలించిన తర్వాత నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలకు సంబంధించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa