బ్రిటన్ రాజధాని లండన్లో 16 ఏళ్లుగా భారతీయ రుచులను అందిస్తున్న ప్రముఖ 'రంగ్రేజ్' రెస్టారెంట్ శాశ్వతంగా మూతపడనుంది. పెరిగిన నిర్వహణ ఖర్చులు, నిరంతర వేధింపులు, దాడులతో పాటు స్థానిక పోలీసుల నుంచి సరైన మద్దతు లేకపోవడమే ఇందుకు కారణమని యజమాని హర్మన్ సింగ్ కపూర్ ప్రకటించారు. వచ్చే నెలలో రెస్టారెంట్ను మూసివేయనున్నట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.గత కొంతకాలంగా హర్మన్ సింగ్ ఖలిస్థాన్ వేర్పాటువాదానికి వ్యతిరేకంగా తన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థానీల నుంచి తనకు, తన కుటుంబానికి ఆన్లైన్లో వేధింపులు, దాడులు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు.16 ఏళ్ల మరపురాని ప్రయాణం తర్వాత, వచ్చే నెలలో రంగ్రేజ్ రెస్టారెంట్ను మూసివేయాలని బాధతో నిర్ణయం తీసుకున్నాను. పెరిగిన ఖర్చులు, పాకిస్థానీల నుంచి దాడులు, పోలీసుల నుంచి సరైన మద్దతు లేకపోవడం వల్ల వ్యాపారాన్ని కొనసాగించడం అసాధ్యంగా మారింది అని హర్మన్ సింగ్ తన పోస్టులో పేర్కొన్నారు.రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఇకపై పూర్తిస్థాయిలో ఉద్యమకారుడిగా మారతానని స్పష్టం చేశారు. వేర్పాటువాదులు ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు నా వ్యాపారాన్ని దెబ్బతీయగలరు కానీ, నా సంకల్పాన్ని కాదు. ఇకపై ఎలాంటి ఆటంకాలు లేకుండా వారిపై మరింత బలంగా పోరాడతాను అని ఆయన హెచ్చరించారు. గతంలో 2023లో కూడా ఖలిస్థాన్ మద్దతుదారుల నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని, రెస్టారెంట్పై దాడి జరిగిందని హర్మన్ సింగ్ ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa