సాధారణంగా రూమ్మేట్స్ అంటే చాలా స్నేహంగా ఉంటారు. ఒకే దగ్గర కలిసుండే వాళ్లు కాబట్టి.. కలిసే వండుకోవడం, తినడం, బయట తిరగడం వంటివి చేస్తూ.. మంచి స్నేహితుల్లా మారిపోతుంటారు. మరికొందరికి తమ రూమ్మేట్స్ నచ్చకపోయినా కొన్ని సార్లు వారితోనే కలిసి ఉండాల్సి వస్తే.. చేసేదేమీ లేక భరిస్తుంటారు. వారితో మాట్లడకుండానే జీవితాన్ని నెట్టుకొస్తారు. ఈ రెండు రకాల మనుషులను మనం ఇప్పటి వరకు చూశాం. కానీ అమెరికాలో మాత్రం ఓ వ్యక్తి తోటి రూమ్మేట్స్ నచ్చక ఎవరూ ఊహించని పని చేశాడు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ తింటున్న ఆహారంపై వారికి తెలియకుండా పురుగుల మందు కొట్టాడు. రెండేళ్లుగా ఇదే పని చేస్తుండగా.. వారి కాలేయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అసలేమైందా అని ఆరా తీస్తే ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..?
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డేవిడ్, బిల్లీ సోన్హాప్పర్ అనే దంపతుల మరో వ్యక్తితో కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా డేవిడ్, బిల్లీ దంపతులు తరచూ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలవుతున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. డేవిడ్ కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అలాగే బిల్లీ కాలేయం కూడా కొంచెం దెబ్బ తిన్నట్లు చెప్పారు. రక్త పరీక్షల నివేదికలను చూసిన వైద్యులు.. ఇది ఖచ్చితంగా ఏదైనా విషం వల్ల జరిగిన నష్టమేనని అనుమానం వ్యక్తం చేశారు. కేవలం ఆరోగ్యం పాడవ్వడమే కాకుండా వారి బట్టలు చిరిగిపోవడం, వస్తువులు మాయమవ్వడం వంటి వింత సంఘటనలు కూడా వారి ఇంట్లో జరుగుతుండేవి.
అసలేం జరుగుతుందో అర్థం కాక దంపతులు ఇద్దరూ వంట గదిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. అప్పుడే వారికొక భయంకరమైన నిజం తెలిసింది. ముఖ్యంగా తమ రూమ్మేట్, స్నేహితుడు అయిన 42 ఏళ్ల తిమోతి బ్రాడ్బరీ ముఖానికి గ్యాస్ మాస్క్ ధరించి మరీ.. వంటగదిలోని ప్రతి వస్తువుపై ఏదో స్ర్రే చేశాడు. పండ్లు, కూరగాయలు, కాఫీ పొడి, కాఫీ పాట్, ప్యాంట్రీలో ఉన్న ఇతర ఆహార పదార్థాలపై కూడా చరెయిడ్' అనే పురుగుల మందును కొట్టాడు. ఇలా వంటగదిలోని ప్రతి అంగుళాన్ని అతను విషపూరితం చేస్తున్నట్లు దంపతులు గుర్తించారు.
చాలా నెలల నుంచి అతడు ఇలాగే చేస్తున్నాడని తెలుసుకుని.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని చూసి నిజాన్ని నిర్దారించుకున్నారు. ఈక్రమంలోనే ఫిబ్రవరి 24వ తేదీన తిమోతిని అరెస్ట్ చేయడానికి వెళ్లారు. అప్పుడే అతను వారితో దాదాపు రెండు గంటల పాటు ప్రతిఘటించాడు. చివరికి డిప్యూటీలు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా ఆహారం, పానీయాలు, మందులను విషపూరితం చేసినందుకు అతనిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ దంపతులు ఈ భయంకరమైన మానసిక వేదన నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. "మాకు విడిగా గదులు ఉన్నప్పటికీ వంటగదిని కలిసి పంచుకుంటాం. ఆ నమ్మకంతోనే అతను మా ఆహారంపై ఇలా స్ప్రే చేశాడు" అని బిల్లీ కన్నీరుమున్నీరయ్యారు. తమ ఆరోగ్య పరిస్థితి అస్సలే బాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa