అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంపై భారత్ ఇంత వరకూ స్పందించలేదు. ఖమేనీ మరణాన్ని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మౌనంగా ఉన్న ప్రధాని మోదీ యంత్రాంగం.. బదులుగా సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చింది. ఈ వైఖరి అనేక ప్రధాన ప్రపంచ శక్తుల ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
పశ్చిమాసియాలో ఘర్షణపై సోమవారం స్పందించిన ప్రధాని మోదీ.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఎప్పుడూ శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుందని కెనడా ప్రధాని మార్క్ కార్నీతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో అన్నారు. ‘ఇటువంటి వివాదాల్లో భారత్ ఎల్లప్పుడు చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిస్తుంది’ అని తెలిపారు. అంతేకాదు, ఖమేనీ మరణం గురించి ఆయన ప్రస్తావించలేదు. అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి దారుణంగా మారింది.
ఖమేనీ మరణాన్ని ఖండిచిన 67 దేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అర్జెంటీనా, ఉక్రెయిన్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడాలు రాక్షసుడు అంతమయ్యాడని, ఇరాన్ ప్రజలకు న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణాన్ని 67 దేశాలు ఇప్పటి వరకూ ఖండించాయి. అయితే, భారత్కు కీలక భాగస్వాములైన గల్ఫ్ దేశాలు వ్యతిరేకంగా స్పందించాయి లేదా మౌనంగా ఉన్నాయి. ఇరాన్ దాడులపై సౌదీ అరేబియా మౌనంగా ఉండగా, గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ అత్యవనసర సమావేశం ఏర్పాటుచేసింది. తమపై క్షిపణి దాడులతో యూఏఈ టెహ్రాన్లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేసి, దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిచింది. జర్మనీ, జపాన్లు ప్రాంతీయ స్థిరత్వం, ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. సంతాపం తెలుపుతూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఇస్లామిక్ సహకార కూటమిలోని 57 సభ్య దేశాల్లో10 కంటే తక్కువ మాత్రమే సంతాపం తెలిపాయి. రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరార్, టర్కీ, పాకిస్థాన్, మలేషియా వంటి ఇరాన్ మిత్రదేశాలు మాత్రమే అమెరికా-ఇజ్రాయెల్ దాడులను ఖండించాయి.
ఇదిలా ఉండగా, భారత్ మాత్రం స్పందించకపోవడానికి గతంలోనే ఆయన కశ్మీర్ గురించి చేసి వ్యాఖ్యలే కారణమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2017 నుంచి 2024 మధ్య నాలుగుసార్లు భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని, ఇరాన్ రాయబారులకు ప్రతిసారి న్యూఢిల్లీ సమన్లు పంపిందని తెలిపాయి.
2017 లో పాకిస్థాన్కు వంతపడుతూ అణచివేతకు గురైన కశ్మీరీల కోసం ముస్లింలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ.. 2021 ఢిల్లీ అల్లర్లు, సెప్టెంబరు 2024లో పౌరసత్వ సవరణ చట్టంపై ఎక్స్ (ట్విట్టర్)లో భారత్కు వ్యతిరేకంగా పోస్ట్లు పెట్టారు. ‘‘ఉన్మాద హిందువులు ముస్లింలను ఊచకోత కోస్తున్నారు.. భారత్లో ముస్లింల ఉనికి ప్రమాదం ఉంది’’ అంటూ విషం గక్కారు.
మరోవైపు, అమెరికా అణు ఒప్పంద చర్చల సందర్భంగా ఎల్ఎన్జీ ఒప్పందంపై టెహ్రాన్ బెదిరింపులకు పాల్పడినా 2005, 2006, 2009లో అంతర్జాతీయ అణు శక్తి సంస్థ తీర్మానంపై ఇరాన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఓటేసిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
సార్వభౌమ దేశాల ప్రతిస్పందనలు జాతీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తాయని, భారత్ అనుసరిస్తున్న ఈ మౌనం వల్ల ఇరాన్ దాడులకు ప్రభావితమైన గల్ఫ్ దేశాలతో సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు, భారత్పై ప్రతికూల వైఖరి అవలంభించిన ఖమేనీ మరణాన్ని పట్టించుకోకుండా.. ఇతర ప్రజాస్వామ్య దేశాలు అనుసరించిన విధానాన్నే భారత్ అవలంభిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa