రాష్ట్రంలో వాణిజ్య రంగానికి కీలకమైన గ్యాస్ సరఫరా సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా హోటల్ రంగం ఈ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ఈ నేపథ్యంలో హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ను కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని, అనేక ప్రాంతాల్లో సమయానికి గ్యాస్ అందక హోటళ్ల కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని వారు పేర్కొన్నారు. రోజువారీ ఆదాయంపై ఆధారపడే చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు ఈ పరిస్థితితో తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయని తెలిపారు. గ్యాస్ కొరత కారణంగా వంటలలో ఆలస్యం, కస్టమర్లకు సేవలలో అంతరాయం వంటి సమస్యలు పెరుగుతున్నాయని వివరించారు.ప్రత్యేకంగా పండుగల కాలం, రంజాన్ వంటి సందర్భాల్లో గ్యాస్ డిమాండ్ మరింత పెరుగుతుందని, అందువల్ల సరఫరా నిరంతరంగా ఉండటం అత్యంత అవసరమని అసోసియేషన్ సూచించింది. సరఫరాలో లోపాలు కొనసాగితే వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని, ధరలు పెరిగే పరిస్థితి తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.ఈ అంశంపై స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్ వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి పరిస్థితిని సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అదనపు కేటాయింపులు చేసి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.ప్రభుత్వం ఈ సమస్యను ప్రాధాన్యతగా తీసుకుని తగిన చర్యలు చేపడితే హోటల్ రంగానికి ఉపశమనం లభించనుంది. వ్యాపార కార్యకలాపాలు నిరంతరంగా కొనసాగాలంటే గ్యాస్ సరఫరా కీలకమని, ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం కావాలని వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa