ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బతికున్నానని చెప్పేందుకు...ఊరేగింపుగా వచ్చిన తాత

national |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 11:21 PM

అధికార్ల తీరుకు నిరసనగా ఓ తాతా తనదైన శైలీలో నిరసన తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆయన పేరు దులి చంద్.. వయసు 102 ఏళ్లు.. అధికారులు తన పెన్షన్ నిలిపివేయడంతో ఆందోళన చెందాడు. తన మనవడిని పట్టుకుని ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లి అడిగాడు. దులి చంద్ చనిపోయినట్టుగా ప్రభుత్వ రికార్డుల్లో ఉందని.. పెన్షన్ ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పారు. తాను స్వయంగా ఆఫీసుకు వచ్చినా కూడా చనిపోయావని అనడం ఏమిటని దులి చంద్ నిలదీసినా లాభం లేకపోయింది. దీంతో దులి చంద్, ఆయన మనవడు, మరికొందరు కలిసి సరికొత్త నిరసన ప్లాన్ చేశారు.


దులిచంద్ తెలుపు రంగు పైజామా, కుర్తా ధరించి.. శుభకార్యాల సమయంలో ధరించే టోపీ పెట్టుకుని.. గుర్రపు బండిలో ప్రభుత్వాఫీసుకు భారీ ఊరేగింపుగా వెళ్లాడు.


అందంగా అలంకరించిన గుర్రపు బండిలో ఒక చేతిలో గండ్ర గొడ్డలి, మరో చేతిలో ‘నేను బతికే ఉన్నాను’ అని రాసిపెట్టిన ఫ్లెక్సీ పట్టుకుని దులి చంద్ ఆసీనుడయ్యాడు. గుర్రపు బండి ముందు మేళతాళాలు, నృత్యాలతో రహదారిపై ఊరేగింపు నిర్వహించారు. ‘నేను బతికే ఉన్నాను. నాకు పెన్షన్ ఇవ్వండి’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని కొందరు ఊరేగింపులో నడిచారు. ఓ స్వచ్చంద సంస్థ ప్రతినిధులు ఈ నిరసనకు సహకరించారు. ‘‘ఇలా ఇంత మంది ముందు ఊరేగినప్పుడు అయినా నేను బతికే ఉన్నానని ప్రభుత్వ అధికారులకు తెలుస్తుందేమో” అని దులి చంద్ వ్యాఖ్యానించారు.  ఈ నిరసనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ‘ఈ నిరసన ఏదో చిత్రంగా చాలా బాగుంది’ అని కొందరు అంటుంటే.. ‘ఇలాంటివి చూసి అయినా ప్రభుత్వ అధికారులకు సిగ్గు రావాలి’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa